జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్‌ | Telangana Corona Vaccine Coverage Surpasses National Average | Sakshi
Sakshi News home page

జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్‌

Nov 12 2021 5:01 AM | Updated on Nov 12 2021 3:29 PM

Telangana Corona Vaccine Coverage Surpasses National Average - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో కరోనా టీకాల కార్యక్రమం జాతీయ సగటును మించి పూర్తయిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్‌ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్‌ వేశారని చెప్పారు. జాతీయ స్థాయిలో మొదటి డోస్‌ 79 శాతం, రెండో డోస్‌ 37.5 శాతం నమోదైందని వివరించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

వ్యాక్సినేషన్‌పై రేపు వీడియో కాన్ఫరెన్స్‌ 
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త వైద్య కళాశాలలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్‌లో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తదితర అంశాలపై హరీశ్‌రావు చర్చించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ వేగం పెంచడంలో భాగంగా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు.

అలాగే కరోనా తగ్గుముఖం పట్టడంతో 350 పడకలు గల కింగ్‌ కోఠి జిల్లా దవాఖానాలో సాధారణ వైద్యసేవలు పునరుద్ధరించాలని, టిమ్స్‌ ఆస్పత్రిలో 200 పడకలు (ఇవి కోవిడ్‌ చికిత్స కోసం) మినహా సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని, టిమ్స్‌ సిబ్బంది పెండింగ్‌ జీతాలు, ఆసుపత్రి బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. అంతకుముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్టంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్‌ పరిస్థితిని వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement