
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి(Revanth Reddy) శుక్రవారం వికారాబాద్, నారాయణ పేట జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. మధ్నాహ్నం 12 గంటలకు సీఎం వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు. పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరలో భాగంగా ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ తర్వాత నారాయణపేట మండలం అప్పక్పల్లి చేరుకుంటారు. అక్కడ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ను ప్రారంభిస్తారు. అనంతరం అప్పక్పల్లిలో మొదటి విడతగా గతనెల 26న మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నారాయణపేట మెడికల్ కాలేజీలో అకడమిక్ బ్లాక్తో పాటు, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి ప్రసంగిస్తారు.
