Telangana CM KCR Delhi Tour: ఢిల్లీలో సీఎం కేసీఆర్‌

Telangana CM KCR Couple DelhI Tour Along With MLA Kavitha - Sakshi

వైద్య పరీక్షలు చేయించుకోనున్న సీఎం దంపతులు

11న ఢిల్లీలో ధర్నాకు జాతీయస్థాయి రైతు నేతలను ఆహ్వానించనున్న కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ తన సతీమణి శోభ, కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ సీఎం తో పాటు ఆయన సతీమణి వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్టు సమాచారం. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ధర్నాను తలపెట్టిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాడిన ఉత్తరాదికి చెందిన రైతు సంఘాల ముఖ్య నాయకులను ఈ ధర్నాకు ఆహ్వానించాలని సీఎం యోచిస్తున్నారు.

రాకేశ్‌ టికాయత్‌తో పాటు ఇతర ముఖ్య రైతు సంఘాల నాయకులతో ఆయన ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశముంది. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతు న్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌చేస్తూ సోమవారం నుంచి పార్లమెంట్‌లో నిరసనలు ఉధృతంగా చేపట్టాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. సోమవారం నుంచి టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top