28 వరకు శాసనసభ సమావేశాలు 

Telangana Assembly Till Session September 28 - Sakshi

రెండో శనివారం, ఆదివారాలు మినహా 18 రోజులు భేటీ

నేడు పీవీకి భారతరత్నపై తీర్మానం

రేపు అసెంబ్లీ ముందుకు కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, 10, 11 తేదీల్లో చర్చ

స్పీకర్‌ పోచారం అధ్యక్షతన బీఏసీ సమావేశంలో నిర్ణయాలు  

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 28 వరకు 18 రోజులపాటు నిర్వహించాలని అసెంబ్లీ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సోమవారం నిర్ణయించింది. సభ నిర్వహణ తీరుతోపాటు సభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీలో కూలంకషంగా చ ర్చించారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా స్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశాలు పొడిగించాల్సి వస్తే ఈ నెల 28న మళ్లీ బీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సభను ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభించి గంట ప్రశ్నోత్తరాలు, మరో అరగంట జీరో అవర్‌ చేపడతారు. ప్రశ్నోత్తరాల్లో గరిష్టంగా ఆరు ప్రశ్నలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. టీ విరామం తర్వాత లఘు చర్చ ఉంటుంది. ఈ నెల 12, 13, 20, 27 తేదీల్లో సమావేశాలకు విరా మం ఇస్తారు.  

బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక సమావేశం 
సమావేశాల సందర్భంగా బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో రెండు లేదా మూడు రోజులపాటు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంట ల వరకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కా నుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ఈ నెల 9న సభలో ప్రవేశపెట్టనుండగా 10, 11 తేదీల్లో ఈ అంశంపై చర్చ జరగనుంది. ఈ నెల 9 నుంచి 28 వరకు ప్రతిరోజూ ప్రభుత్వ కార్యకలాపాలు, బిల్లులు ప్రస్తావనకు వస్తాయి. 

కాంగ్రెస్‌ ప్రతిపాదించిన అంశాలివే
కరోనా కేసులు, కృష్ణా జలాలు, ఎల్‌ఆర్‌ఎస్‌/బీఆర్‌ఎస్, బెల్టు షాపులు, పోడు వ్యవసాయం, పాత సచివాలయం కూల్చివేత, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్, నూతన విద్యావిధానం, విపక్షాల పాత్ర వంటి 11 అంశాలను చర్చించాలని కాంగ్రెస్‌ సభాపక్షం నేత భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. రెవెన్యూ చట్టం బిల్లును రూపొందించేందుకు మూడేళ్లు పట్టినందున దాన్ని అధ్యయనం చేసేందుకు తగినంత గడువు ఇవ్వాలని భట్టి కోరినట్లు తెలిసింది. మీడియా పాయింట్‌ను ఎత్తేయడంపై బీఏసీలో వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం. మీడియా పాయింట్‌ ఎత్తివేత ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే అని భట్టి వాదించగా సభలో అన్ని అంశాలపై మాట్లాడేందుకు తగినంత సమయం ఇస్తామని, ఎన్నిరోజులైనా చర్చకు సిద్ధమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. 

అసెంబ్లీ తరహాలోనే మండలి..
శాసనసభ తరహాలోనే శాసనమండలి సమావేశాలు కూడా 18 రోజులపాటు నిర్వహించాలని మండలి బీఏసీ నిర్ణయించింది. కౌన్సిల్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణ యం తీసుకున్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సభా నాయకుడు సీఎం కేసీఆర్‌తోపాటు మం త్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎస్‌. నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్, విప్‌ గొంగిడి సునీత, విపక్ష నేతలు అక్బరుద్దీన్‌ ఒవైసీ, భట్టి విక్రమార్క, శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వి. నర్సింహాచార్యులు పాల్గొన్నారు.

పీవీకి భారతరత్న... రెవెన్యూ చట్టం 
మంగళవారం ఉద యం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఈ సందర్భంగా పీవీ శతజ యంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో మంగళవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను రద్దు చేయాలని బీఏసీ నిర్ణయించింది. మరోవైపు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్న ఏఐఎంఐఎం గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

విపక్షాలు కోరినన్ని రోజులు సమావేశాలు: కేసీఆర్‌ 
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు అసెంబ్లీ సమావేశాలు వేదికగా ఉపయోగపడతాయని, ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సభ నడిపేందుకు సిద్ధమని బీఏసీ భేటీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పార్టీలవారీగా, సభ్యుల సంఖ్య ఆధారంగా చర్చా సమయం కేటాయించాలని స్పీకర్‌ను కోరారు. ప్రభుత్వం తరఫున ఈ సమావేశాల్లో 16 అంశాలను ప్రతిపాదిస్తున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. సీఎం ప్రతిపాదనలకు అంగీకరిస్తున్నట్లు ఏఐఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. తమ పార్టీ తరఫున ప్రతిపాదించే అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్క కోరగా సీఎం అంగీకరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top