అఫ్జ‌ల్‌గంజ్‌ టూ ట్యాంక్‌బండ్‌ అలర్ట్‌.. బీదర్‌ ముఠా ఎక్కడ? | Telangana And Karnataka Police Search ATM Thief Gang | Sakshi
Sakshi News home page

అఫ్జ‌ల్‌గంజ్‌ టూ ట్యాంక్‌బండ్‌ అలర్ట్‌.. బీదర్‌ ముఠా ఎక్కడ?

Jan 17 2025 10:32 AM | Updated on Jan 17 2025 11:28 AM

Telangana And Karnataka Police Search ATM Thief Gang

సాక్షి, హైదరాబాద్: నగరంలోని అఫ్జ‌ల్‌గంజ్‌ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ట్రావెల్స్ ఆఫీసు మేనేజ‌ర్‌పై దుండగులు కాల్పులు జ‌రిపారు. ఇక, ఈ కాల్పుల‌కు పాల్ప‌డిన ముఠాను బీద‌ర్ ఏటీఎం దొంగ‌ల ముఠాగా పోలీసులు తేల్చారు. దీంతో, నిందితుల కోసం పోలీసుల దర్యప్తు కొనసాగుతోంది.

అఫ్జ‌ల్‌గంజ్‌ కాల్పుల కలకలం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు చెందినట్లు గుర్తించారు. అడ్డ దారుల్లో రాయ్‌పూర్‌ పారిపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. నిందితులు అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే, అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారనేది మాత్రం తెలియరాలేదు. దీంతో, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఏం జ‌రిగిందంటే..?
కర్ణాటకలోని బీద‌ర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బీద‌ర్‌లో గురువారం ఉద‌యం ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

ఇక దొంగ‌లు తెలంగాణ వైపు త‌మ బైక్‌ను మ‌ళ్లించిన‌ట్లు బీద‌ర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులు బీద‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అఫ్జ‌ల్‌గంజ్‌ వ‌ద్ద దొంగ‌ల‌కు బీద‌ర్ పోలీసులు కనిపించారు. దొంగ‌ల ముఠా.. త‌ప్పించుకునేందుకు అఫ్జ‌ల్‌గంజ్‌లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాల‌యంలోకి ప్ర‌వేశించారు. పోలీసుల‌పై కాల్పులు జ‌రుపుతుండ‌గా.. అక్క‌డే ఉన్న ట్రావెల్స్ కార్యాల‌యం మేనేజ‌ర్‌కు బుల్లెట్లు త‌గిలాయి. దీంతో అత‌నికి తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగింది. అప్ర‌మ‌త్త‌మైన హైద‌రాబాద్ పోలీసులు కూడా బీద‌ర్ పోలీసుల‌తో పాటు దొంగ‌ల ముఠాను ప‌ట్టుకునేందుకు య‌త్నిస్తున్నారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement