IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌లో కోవిడ్‌ కలకలం.. 123 పాజిటివ్‌ కేసులు

Telangana: 123 Test Positive at IIT Hyderabad Campus - Sakshi

ఆదిలాబాద్‌ ఎస్‌బీఐలో 8, సింగరేణి ఆస్పత్రిలో 15 మందికి

ఖమ్మంలో 10మంది పోలీసులకూ

సాక్షి, సంగారెడ్డి/ఆదిలాబాద్‌/ఖమ్మం: సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనాబారిన పడినవారిలో విద్యార్థులు, ప్రొఫెసర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని హైదరాబాద్‌ ఐఐటీలో బుధవారం నాటికి 123 మందికి కరోనా సోకింది. వీరిలో 107 మంది విద్యార్థులు కాగా, ఏడుగురు ఫ్యాకల్టీలు, ఆరుగురు ఇతర ఉద్యోగులున్నారు. ఈ నెల తొలి వారం వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఐఐటీకి వచ్చారు. ఐదో తేదీన ఇద్దరు విద్యార్థులకు స్వల్ప లక్షణాలుండటంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో రెండుడోసుల వ్యాక్సినేషన్‌ తీసుకున్నట్టు సర్టిఫికెట్‌ ఉన్నవారినే క్యాంపస్‌లోకి అనుమతించారు. అయినా కేసులు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం క్యాంపస్‌లో 2 వేలమంది విద్యార్థులు, 250 మంది ఫ్యాకల్టీలు, వారి కుటుంబీకులు ఉన్నారు.  ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రధాన శాఖలో 8 మంది ఉద్యోగులకు కోవిడ్‌ సోకింది. పోలీసుశాఖలో ఇద్దరు సీఐలకు కరోనా వచ్చింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు సహా 15 మంది సిబ్బం ది కరోనా బారినపడ్డారు. మంచిర్యాల పోలీసు స్టేషన్‌లో బుధవారం 97 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా, ట్రాఫిక్‌ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చింది. ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్లో బుధవారం సీఐ సహా పదిమంది కరోనా బారిన పడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top