
హైదరాబాద్, సాక్షి: హుస్సేన్ సాగర్ లో జరిగిన బోటు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గణపతి చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. రిపబ్లిక్ డే నాడు భరతమాత మహాహారతి కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుని బోట్లు దగ్ధం కావడం తెలిసిందే. అయితే ప్రమాదంలో గణపతి తీవ్ర గాయాలతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు.
ఈ రోజు ఉదయం అతను కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు. గణపతి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా అని, దాదాపు 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరోవైపు కార్యక్రమానికి వెళ్లి కనిపించకుండా పోయిన అజయ్(21) కోసం హస్సేన్ సాగర్ ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఇంకోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
