సాక్షి,న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో హైడ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కంటోన్మెంట్లోని 40 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
కంటోన్మెంట్లోని వివాదాస్పద 40 ఎకరాల భూమి శాంత శ్రీరామ్ కన్ స్ట్రక్షన్దేనని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇది ప్రభుత్వ భూమి అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్ను ఏకంగా 219 రోజుల ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లయింది.
ఇదే భూమికి సంబంధించి హైకోర్టు తీర్పును ఉల్లంఘించి, శాంత శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ సంస్థ భూమిలో హైడ్రా కూల్చివేతలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని, ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ డివిజన్ బెంచ్ ద్వారా స్టే పొందడం గమనార్హం.
ఇదీ చదవండి : ‘హైడ్రా’ నుంచి రంగనాథ్ను తొలగించండి


