సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తు దారులకు అలెర్ట్. కొత్తగా పెన్షన్ అప్లయ్ చేసుకోవాలనుకునే వారి గడువు నేటితో (సెప్టెంబర్ 15) ముగియనుంది. అర్హులైన పేదలు ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే, ఇవాళ్టిలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది (సుమారు 4.8 లక్షలకు పైగా) దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 25 నాటికి క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరు వరకు అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను పరిశీలిస్తారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత, అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు. అర్హులైన నిరుపేదలు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.


