ముసుగులు ధరించిన వ్యక్తులెవరో గుర్తించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి
వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి.
సాక్షి, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏపై కొందరు ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి యత్నించినట్లు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
పండగ రోజున సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో దాదాపు 15 మంది ముసుగులు ధరించి ఇంటరాగేషన్ రూమ్లోకి వెళ్లినట్లు తెలిపారు. అయితే, అక్కడున్న బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు వారిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.
దీంతో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్స్టేషన్లోనే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర విషయమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే, ముసుగులు ధరించిన వ్యక్తులు పోలీస్స్టేషన్లోకి ఎలా వచ్చారు? వారెవరు? వారి వెనుక ఎవరున్నారు? అనే విషయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
ఘటనకు సంబంధించి పోలీస్స్టేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి వివరాలను సేకరించాలని ఆయన సూచించారు. అలాగే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల పూర్తి ఫుటేజ్ను ఎలాంటి మార్పులు లేకుండా భద్రపరచాలని డిమాండ్ చేశారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించి అసలు ఏం జరిగిందో తేల్చాలని అన్నారు.
హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఘటనపై స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా విచారణ జరిపి, దాడికి యత్నించిన వ్యక్తులను గుర్తించాలని అన్నారు. ఘటన వెనుక ఉన్న వారిని కూడా గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కవిత జోరు.. మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సారథులు


