సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన తీరును పరిశీలించేందుకు పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇద్దరినీ అసెంబ్లీ ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సైఫాబాద్ పోలీసులు ప్రయత్నించగా, పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర వాదనలు చోటుచేసుకున్నాయి.
అసెంబ్లీ ఎదుట ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో కూపీ లాగుతున్న పోలీసులు, సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం కేటీఆర్ పీఏ, పీఆర్వో అక్కడికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే దీనిని న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ విచారణ కొనసాగుతోందని న్యాయవాదులు ఆరోపించారు.
మరోవైపు, ఈ వివాదం మధ్యలోనే కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్ఓ మహేష్ స్పందిస్తూ.. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తామే స్వయంగా అసెంబ్లీ వరకు నడుచుకుంటూ వస్తామని చెప్పడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఈ విచారణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


