సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలిపూజ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్లు గవర్నర్కు స్వాగతం పలికారు.
ఖైరతాబాద్లో ఈ ఏడాది (72వ సంవత్సరం) 69 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిని రూపొందించారు. మహాగణపతి ఎత్తు, వెడల్పును బట్టి ఆగమ శాస్త్రంలో సూచించిన విధంగా కంటి ఎత్తు, వెడల్పు కచ్చితమైన స్కేలు ప్రకారం తీర్చిదిద్ది కంటిపాపను అమరుస్తామని.. తద్వారా వినాయకుడు నలు వైపుల నుంచి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఉంటుందని శిల్పి రాజేంద్రన్ తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా నగరం పండగ కళను సంతరించుకుంది. గణనాథుడి పూజలతో భక్తులు తరించనున్నారు. కాగా.. పూజా సామగ్రి ధరలు చుక్కలనంటాయి. నగరంలోని బేగంబజార్, సుల్తాన్ బజార్, గోషామహల్, మెహిదీపట్నం తదితర మార్కెట్లలో గత ఏడాదితో పోలిస్తే అన్ని పూజా సామగ్రి ధరలు 40 నుంచి 50 శాతం పెరిగినట్లు ప్రజలు చెబుతున్నారు.
సాధారణంగా రూ.500–600తో చిన్న పూజకయ్యే ఖర్చు ఈ ఏడాది కనీసం రూ.1,200 నుంచి రూ.1,500కు చేరిందని అంటున్నారు. పూలు, పండ్లతో పాటు గరిక, తమలపాకులు, అరటి ఆకులు, జిల్లేడు, మారేడు తదితరాల ధరలు పెరిగాయి. వినాయకుడికి నైవేద్యంగా పెట్టే మోదకాలు, స్వీట్లు, లడ్డూలకు డిమాండ్ పెరగడంతో ధరలు చుక్కలనంటాయి.
ఇదీ చదవండి: ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో..


