సాక్షి, హైదరాబాద్: మరికొన్ని గంటల్లో దుబాయ్ వెళ్లాల్సిన ఆ యువకుడికి అదే చివరి ప్రయాణమైంది. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న కరీంనగర్కు చెందిన అజ్మల్.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. శంషాబాద్ కిషన్గూడా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సృష్టించిన బీభత్సం ఘటనలో ఇది చోటు చేసుకుంది.
కరీంనగర్కు చెందిన అజ్మల్ దుబాయ్ ఫ్లైట్ కోసం ఎయిర్పోర్టుకు బయల్దేరాడు. దారిలో టీ కోసమని ఆ హోటల్ వద్ద ఆగాడు. ఆ సమయంలో ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చిన బస్సు అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడతను. బస్సు సరాసరి హోటల్లోకి దూసుకెళ్లడంతో అక్కడ ఉన్న పలువురు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అజ్మల్తో పాటు మరో వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో 50 మందికిపైగా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. అజ్మల్తో పాటు తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితీ విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి కారణమైన బస్సు.. సెవెన్హిల్స్ ట్రావెల్స్కు చెందిందిగా ధృవీకరణ అయ్యింది. ఈ ఘటనలో మూడు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదం ధాటికి హోటల్ పరిసరాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
ఓ కంటైనర్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అయితే వేగంగా వస్తున్న ప్రైవేట్ టావెల్స్ బస్సు దానిని తప్పించబోయి హోటల్లోకి దూసుకెళ్లిందని తెలుస్తోంది. అయితే కొన్ని గంటల్లో దుబాయ్ విమానం ఎక్కాల్సిన అజ్మల్.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది.
ఇదీ చదవండి: కొత్త కారుతో రోడ్డెక్కాలన్నా భయమేనా?


