గ్రేటర్ పరిధిలో జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. మిత్రుడి పుట్టిన రోజు వేడుకకు స్నేహితులతో కలిసి ఆనందంగా వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పడంతో ఇంటర్ విద్యార్థి అసువులు బాశాడు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన కోకాపేటలో చోటుచేసుకోగా.. రోడ్డు పక్కన స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ బాలుడు దుర్మరణం చెందిన మరో ఘటన అత్తాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. కీసర ఓఆర్ఆర్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా, రాంగ్రూట్లో వచి్చన ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు మృత్యువాత పడిన ఘటన ఎల్బీనగర్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్: కూకట్పల్లికి చెందిన మదన్మోహన్ రెడ్డి (17) ఇంటర్ విద్యార్థి. మిత్రుడి పుట్టి న రోజు వేడుకల కోసం శనివారం రాత్రి మరో స్నేహితుడికి చెందిన కారు తీసుకుని వెళ్లాడు. వేడుకల అనంతరం కోకాపేట వైపు వెళ్లి వద్దామంటూ స్నేహితులతో కలిసి ఇన్నోవా కారులో బయలుదేరారు. కోకాపేట నియోపోలిస్ వ్యూపాయింట్ వద్ద తెల్లవారు జామున కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న మదన్మోహన్రెడ్డి డోరులో నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్న స్తంభానికి తగలటంతో తలకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నాయని కోకాపేట సెక్టార్ ఎస్సై మహేందర్, నార్సింగి ఇన్స్పెక్టర్ డి. విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు.
స్తంభాన్ని బైక్ ఢీకొని..
వేగంగా దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో మైనర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కార్వాన్ మొగల్ నగర్కు
చెందిన పదో తరగతి విద్యార్థి (14), అదే ప్రాంతానికి చెందిన మరో బాలుడితో కలిసి ద్విచక్ర వాహనంపై కార్వాన్ నుంచి హైదర్గూడ వెళ్తున్నారు. వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డుపక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపారు.
రాంగ్ రూట్లో వచ్చి..
ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు చనిపోగా, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మలక్పేటకు చెందిన సయ్యద్ మాజ్ హుస్సేన్ (16), నారాయణగూడకు చెందిన హంజాలా, న్యూ మలక్పేటకు చెందిన అలీఖాన్ స్నేహితులు. ముగ్గురు కలిసి ఆదివారం తెల్లవారు జామున నమాజు కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉదయం 6.30 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తా సితార హోటల్ వద్ద రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. సయ్యద్ మాజ్ హుస్సేన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగతా ఇద్దరు స్నేహితులు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.


