గౌహతి: అస్సాంలోని కామ్రూప్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ హోటల్ గదిలో ప్రియురాలిని ప్రియుడు కత్తెరతో పొడిచి చంపేశాడు. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన తర్వాత ఆ యువకుడు ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలిని సోనిత్పూర్ జిల్లాలోని హుగ్రాజులికి చెందిన మాలిని గురియాగా గుర్తించారు. ఉదల్ గురి జిల్లాకు చెందిన అభిజిత్ కిందో.. గురియా తనను మోసం చేస్తోందనే అనుమానంతోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు.
కిందో, గురియా కామ్రూప్లోని రంగాయా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక హోటల్లో బస చేశారు. ఉదయం పూట ఆ గదిలోనే మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అదే గదిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గురియా అంతకుముందు రాత్రి చెన్నై నుండి మరో ఇద్దరు మహిళలతో కలిసి రంగాయా చేరుకుందని.. రైల్వే స్టేషన్లో వారిని రిసీవ్ చేసుకునేందుకు కిందో వెళ్లాడని పోలీసులు తెలిపారు. ఆమె ఇతర పురుషులతో మాట్లాడుతుండటంతో ముందే హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది.
ఇదీ చదవండి: కోడలిని హతమార్చి.. బావిలోకి దూకి..


