నాగపూర్లో దారుణం జరిగింది. చేతబడి అనుమానంతో ఓ వృద్ధుడు తన కోడలిని గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతుండగా.. శనివారం మరింత ముదిరింది. లక్ష్మి రవిశంకర్ పాలి (42) బట్టలు ఉతుకుతుండగా ఆమె మామ నూతులాల్ పాలి మరోసారి వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన అతడు ఆమె తలపై గొడ్డలితో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అనంతరం ఆ వృద్ధుడు ఇంటి వెనుక ఉన్న బావిలో దూకాడు. అయితే స్థానికులు అతన్ని కాపాడి చికిత్స నిమిత్తం మెడికల్ ఆసుపత్రికి తరలించారు. నూతులాల్ తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే, తన అనారోగ్యానికి, అలాగే తన కుమారుడి మరణానికి కోడలే చేతబడి కారణమని బలంగా నమ్మాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.
"ఓ వృద్ధుడు బావిలో పడిపోయాడని మాకు సమాచారం అందింది. వెంటనే మా బృందం అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అతన్ని బయటకు తీసింది. లక్ష్మి తన భర్త చనిపోయినప్పటి నుండి ఇంట్లోనే వేరే గదిలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. చేతబడి వల్లే తన కొడుకు చనిపోయాడని, మామ నూతులాల్ ఆమెతో తరచూ గొడవపడేవాడు. నేడు కూడా ఇదే విషయమై వివాదం చెలరేగడంతో అతను ఆమెపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు" అని యశోధరా నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ యూనస్ షేక్ తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యశోధరా నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: లాడెన్ హిట్లిస్ట్లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు


