రాష్ట్ర వ్యాప్తంగా కేసుల జాబితా వెలికి తీసిన సిట్
ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలతో ముందుకు
వివిధ ఏజెన్సీలతో కలిసి పని చేయాలని నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో నిందితులైన ఏడుగురు నేపాలీల్లో ఒక్కరే చిక్కారు. సూత్రధారి, కీలక నిందితురాలు కల్పన సహా మిగతవారు పరారీలోనే ఉన్నారు.
ఈ ఒక్క కేసులోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన నేపాలీ సంబంధిత నేరాల్లో నిందితులుగా ఉండి, పరారీలో ఉన్న వారి సంఖ్య 170గా తేలింది. నేపాలీ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిని పట్టుకోవడానికి సమన్వయంతో, సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఈ నేపాలీ నేరగాళ్లు సంపన్నుల ఇళ్లల్లో పని వాళ్లు, వంట వాళ్లు, వాచ్మెన్లుగా చేరుతున్నారు. తొలినాళ్లలో నమ్మకంగా పనిచేసినా.. ఆపై అదును చూసుకుని పంజా విసురుతున్నారు. సరైన సమయంలో తమ ముఠాకు చెందిన మిగిలిన వారిని రంగంలోకి దింపుతున్నారు. అంతా కలిసి తమ ‘పని’ పూర్తి చేసుకున్న తర్వాత ముందు నగరం..ఆపై దేశం దాటేస్తున్నారు. కల్పన కూడా నేపాల్ చేరినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేటుగాళ్లు నేరం చేసిన వెంటనే తమ సెల్ఫోన్లు, సిమ్కార్డులు ధ్వంసం చేసేసి ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్నారు. ఫలితంగా పోలీసులకు వీరి ఆచూకీ కనిపెట్టడం పెద్ద సవాల్గా మారుతోంది.
రెండు రకాల వ్యూహంతో ముందుకు..
వాంటెడ్గా ఉన్న నేపాలీలను పట్టుకోవడానికి పోలీసులు రెండు రకాలైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సాంకేతిక నిఘా ఉంచడంతో పాటు సరిహద్దుల్లో ఉండే ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టులు, ఇతర విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క ఈ నేరగాళ్ల వివరాలు, ఆచూకీ చెప్పాల్సిందిగా కోరుతూ ఆయా అసోసియేషన్లు, యూనియన్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినప్పటికీ నేపాల్లోకి ప్రవేశించి, వీరికి అరెస్టు చేసుకురావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.
బెయిల్ వస్తే మళ్లీ దొరకరు...
ప్రస్తుతం రాష్ట్ర పోలీసులకు వాంటెడ్గా ఉన్న 170 మందీ నేరం చేసిన వెంటనే పరారు కాలేదు. వీరిలో కొందరు అరెస్టయి.. బెయిల్పై వచి్చ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ష్యూరిటీలు ఇచి్చన వారికీ వీరి వివరాలు తెలియట్లేదు. శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఈ పంథా అనుసరిస్తుండటంతో వీరిపై కోర్టులు నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నాయి.
కీలకంగా వ్యవహరిస్తున్న జీవన్...
రాష్ట్రంలో నేపాలీలకు ఉద్యోగాలు ఇప్పించడం, నేరాలు చేయించడంలో జీవన్ అనే నేపాలీ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు ఓ దళారిగా వ్యవహరిస్తూ సంపన్నుల ఇళ్లల్లో నేపాలీలను పనిలో పెడుతున్నాడు. ఆపై పథక రచన చేసి, మిగతవారిని రంగంలోకి దింపి టార్గెట్ చేసిన ఇంట్లో నేరం చేయిస్తున్నాడు. పథకం సిద్ధమైన తర్వాత నేరం జరగడానికి ముందు తొలుత అతగాడే నేపాల్ వెళ్లిపోతాడు. అతని సహచరులు ఇక్కడే ఉండి ప్రణాళికను అమలు చేస్తారు. కొన్నాళ్లకు మరో పేరుతో వస్తున్న జీవన్ నేర పంథా కొనసాగిస్తున్నాడని పోలీసులకు ఆధారాలు లభించాయి. అతడి కోసం ఆరా తీస్తున్నారు.


