ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణలో తీవ్ర గందరగోళం
తెలుగులో ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణకు ఈసీ ఆదేశం
తెలుగు రాని వారికి ఆంగ్లంలో ఫారాలు ఇవ్వాలని కోరినా స్పందించని ఈసీ
భాష అర్థంకాక తప్పుడు సమాచారమిస్తే ఓటు గల్లంతే
ఆందోళన వ్యక్తం చేస్తున్నరాజకీయ పార్టీలు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) – 2026 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉండగా, వాటి ప్రచురణ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, ప్రతి ఓటరుకు సంబంధించిన పాక్షిక సమా చారంతో ఒక జత ఎన్యూమరేషన్ ఫారాల ప్రచురణను ఈ నెల 15 నుంచే ప్రారంభించాల్సి ఉంది. హైదరాబాద్లో దక్కనీ ఉర్దూ తోపాటు హిందీ, గుజరాతీ, రాజస్తానీ, మరాఠీ, బెంగాళీ, కన్నడ, తమిళం వంటి భాషలు మాట్లాడే ఓటర్లు లక్షల సంఖ్యలో ఉన్నా రు.
రాష్ట్రంలోని ఓటర్లందరికీ పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫారా లను ఏకరూపంగా కేవలం తెలుగులోనే ముద్రించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించడంతో తెలుగు రాని ఓటర్లు ఇక్కట్లకు గురికానున్నట్టు రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఇతర పార్టీల నేతలు ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)ని కలిసి జంట నగరాల ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను తెలుగుతోపాటు ఆంగ్ల భాషలో సైతం ప్రచురించాలని కోరారు. దీనిపై ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
వారం గడిచినా, ఈసీ నుంచి స్పందన రాలేదు. దీంతో బుధవారం సైతం వివిధ పార్టీల ప్రతినిధులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్కు కలిసి ఆంగ్లంలోనూ ఫారాలను ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లందరికీ స్థానిక ఓటర్ల వివరాలతో ప్రచురణకు అవసరమైన డేటాను పంపించగా, తెలుగులో మాత్రమే ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాలను ప్రచురిస్తున్నామని అధికా రులు తెలిపారు. ఈసీ నుంచి అనుమతి వస్తే అవసరమైన చోట పంపిణీ చేసేందుకు ఆంగ్లంలో సైతం ముద్రిస్తామని ఓ అధికారి తెలిపారు.
సరైన సమాచారం భర్తీ కీలకం
ఎన్యూమరేషన్ ఫారంలో ఓటరు పేరు, ఎపిక్ నంబర్, సీరి యల్ నంబర్, పార్ట్ నంబర్, అసెంబ్లీ/పార్లమెంట్ నియోజక వర్గ పేరుతోపాటు పాత ఫొటోను ముద్రి స్తారు. మిగిలిన వివరాలను ఓటరు పూరించాలి. సర్–2002 ఓటర్ల జాబితా ప్రకారం..ఓటరుతోపాటు అతడి బంధువు పేరు, ఎపిక్ నంబ ర్, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం నంబ ర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలతోపాటు ఓటరు పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ (ఐచ్ఛికం), మొబైల్ నంబర్, తండ్రి/సంరక్షకుడి పేరు, ఎపిక్ నంబర్, తల్లి పేరు, తల్లి ఎపిక్ నంబర్, జీవిత భాగ స్వామి పేరు, ఎపిక్ నంబర్ వంటి వివరాలను ఓటరు భర్తీ చేయా ల్సి ఉంటుంది.
బీఎల్ఓలు వివరించినా ఎన్యూమరేషన్ ఫారంలోని భాష అర్థం కాక తప్పుడు సమాచారాన్ని భర్తీ చేస్తే, ఓటర్ల మ్యాపింగ్ సాఫ్ట్వేర్ తేడాలను గుర్తించి అనుమానిత ఓటర్ల జా బితాలో చేర్చే ప్రమాదం ఉంటుంది. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అయితే, ఎన్యూమరేషన్ ఫారా న్ని తప్పుడు సమాచారంతో భర్తీ చేసిన వారిని గుర్తించి జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీ సులు జారీ చేసి వివరణ కోరనున్నారు. విచారణకు హాజరై ఈసీ నిర్దేశించిన 13 రకాల ధ్రువీకరణ పత్రాలను రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈప్ర క్రియ లో ఎక్క డ తేడా వచ్చినా అక్టోబర్ 1న ప్రచురించే సర్– 2026 తుది ఓటర్ల జాబితాలో పేరు గల్లంతయ్యే ప్రమాదముంది.


