వడి వడిగా... బడికి | Telangana Schools Reopen Today After Summer Holidays With Yoga, Sports And No-Bag Day Rules, More Details Inside | Sakshi
Sakshi News home page

వడి వడిగా... బడికి

Jun 15 2026 1:11 AM | Updated on Jun 15 2026 2:24 PM

Schools reopening from today

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం 

విద్యతోపాటు వికాసానికీ బాటలు

ఆటలు ప్రతీ రోజు ఉండాలని ఆదేశం

ప్రభుత్వ స్కూళ్లలో చేరికలపై ఫోకస్‌.. ‘బ్రేక్‌ఫాస్ట్‌’పై ఆశలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం సోమవారం తిరిగి తెరుచుకుంటున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేయగా, ఇప్పటికే అకడమిక్‌ కేడర్‌ను కూడా విడుదల చేసింది. బోధనతోపాటు ఈసారి ప్రతిరోజూ క్రీడలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

పిల్లలతో కథలు లేదా పత్రికలు, మ్యాగజైన్లు లాంటి వాటిని అరగంట చదివించాలని చెప్పింది. ప్రార్థన సమయంలో లేదా అది పూర్తయిన తర్వాత తరగతి గదిలో ఐదు నిమిషాలపాటు విద్యార్థులకు యోగా లేదా ధ్యానం తప్పనిసరి చేసింది. ప్రతి నెలా మూడో శనివారం నో బ్యాగ్‌ డే అమలు చేస్తారు. ఈసారి మొత్తం 227 రోజులపాటు పాఠశాలలు పనిచేస్తాయి. – సాక్షి, హైదరాబాద్‌

విద్యార్థుల సంఖ్య పెరిగేనా?
రాష్ట్రంలోని ప్రభుత్వ రంగంలో ఉన్న 30 వేల స్కూళ్లలో 24 లక్షల మంది పిల్లలున్నారు. 10 వేల వరకూ ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల్లో 36 లక్షల మంది చదువుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని రెండేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోంది. అయినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చే బడిబాట కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా సీరియస్‌గా తీసుకోవాలని విద్యాశాఖ టీచర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రాథమిక బడులు మొత్తం 18,254 ఉంటే వాటిల్లో 6,90,816 మంది విద్యార్థులున్నారు. 

అంటే ఒక్కో బడిలో సగటున 38 మంది ఉన్నారు. 1,864 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. 2023–24లో ప్రభుత్వ స్కూళ్లలో యూడైస్‌ లెక్కల ప్రకారం 18.13 లక్షలుంటే (డ్రాపౌట్స్‌ జరిగాక), 2024–25లో 16.84 లక్షల మంది ఉన్నారు. అంటే ఏడాదిలోనే 1.29 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఈ పరిస్థితి ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ప్రశ్నించేలా ఉంది. బడిబాటకు వెళ్లిన టీచర్లకు పేద, మధ్య తరగతి నుంచి వచ్చే స్పందన భిన్నంగానే ఉంది. విద్యపై తమకు భరోసా లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. సరిగా బోధన జరగదని, నాణ్యత లోపించిందని అంటున్నారు. 

అల్పాహారంపై ఆశలు
ప్రభుత్వ బడులతోపాటు కాలేజీల్లోనూ ఈసారి అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచే ఈ కార్యక్ర మాన్ని అమలు చేస్తారు. కాలేజీల్లో దశలవారీగా ఉంటుంది. మొత్తం 1.44 లక్షల మందికి బ్రేక్‌ఫాస్ట్‌ అందిస్తారు. ఇది విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచుతుందని విద్యాశాఖ ఆశలుపెట్టు కుంది. 

ఈ ఏడాది నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పైనా పాఠాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుస్తకాలు, నోట్‌పుస్తకాల పంపిణీకి మరికొంత సమయం పట్టవచ్చు. ఇవి వస్తేగానీ సాంకేతిక విద్యపై పాఠాలు ఎలా ఉంటాయో చెప్పలేమని టీచర్లు అంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది విద్యార్థుల చేరికలు పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement