
సాక్షి, సంగారెడ్డి: చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీకి సంగారెడ్డి జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్లోనూ ఉంచలేమంటూ అధికారులు తేల్చి చెప్పారు. అఘోరీని తిరిగి పంపించిన సంగారెడ్డి జైలు అధికారులు.. లింగ నిర్థారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీని చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. మరో వైపు, సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న సమయంలో అఘోరీ అరుపులతో హడావుడి చేశాడు. తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబట్టాడు.
పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదుతో మోకిలా పోలీసులు.. అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్- మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నగరానికి తీసుకువచ్చారు. మోకిలా పోలీసులు. అఘోరీతో పాటు వర్షిణిని కూడా నగరానికి తరలించారు. ఏపీకి చెందిన వర్షిణి.. అఘోరీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తమను ఎవరైనా అరెస్టు చేయాలని చూస్తే, ఆత్మహత్య చేసుకుంటామని కూడా హెచ్చరించిన ఈ జంట.. ఓ సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది.