
మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో అధికం
ఏడో స్థానంలో తెలంగాణ
టాప్ టెన్ జిల్లాల్లో ములుగు, భద్రాద్రి
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడి
సాక్షి ప్రతినిధి, వరంగల్: అడవులు అంటుకుంటున్నాయి. అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా చెట్లు, వృక్షాలు కాలిపోతున్నాయి. 2019 నుంచి 2024 నవంబర్ వరకు అయిదేళ్లలో దేశవ్యాప్తంగా అడవుల్లో 11,09,588 అగ్నిప్రమాదాలు సంభవించాయి. అత్యధికంగా 2020–21లో 3,45,989 ప్రమాదాలకు అడవులు ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించిన రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఉండగా.. తెలంగాణ (Telangana) ఏడో స్థానంలో ఉంది.
దేశవ్యాప్తంగా అడవులు అంటుకున్న టాప్ టెన్ జిల్లాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఉన్నాయి. అయితే దేశంలో అటవీ అగ్ని ప్రమాదాలను మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్ట్రో–రేడియోమీటర్ (ఎంవోడీఐఎస్), పోలార్–ఆర్బిటింగ్ పార్టనర్షిప్ విజిబుల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ సూట్ (ఎస్ఎన్పీపీ, ఐఐఆర్ఎస్) ఉపగ్రహ–మౌంటెడ్ సెన్సార్లను ఉపయోగించి గుర్తించినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) తన నివేదికలో ప్రకటించింది.
ఏటా అంటుకుంటున్న అడవులు
మానవ తప్పిదాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశవ్యాప్తంగా ఏటా అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. 2019–20లో జూన్ నుంచి నవంబర్ వరకు 1,23,473 ప్రమాదాలు జరగ్గా, 2020–21 నాటికి 3,45,989కు పెరిగాయి. 2021–22లో 2,23,333, 2022–23లో 2,12,249లు కాగా, 2023–24 నవంబర్ నాటికి 2,03,544లుగా నమోదయ్యాయి. 2019–20లో దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో అత్యధికంగా 14,108 అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగ్గా, 2020–21 నాటికి 34,025కు పెరిగాయి. 2021–22లో 22,052, 2022–23లో 16,119, 2023–24లో 16,008లకు తగ్గాయి.
ఒడిశాలో 2019–20లో 10,062గా ఉన్నా.. 2020–21 వచ్చేసరికి 51,968లతో మొదటి స్థానంలోకి చేరింది. ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ (2020–21లో) 47,795లు, ఛత్తీస్గఢ్లో 38,106 అగ్ని ప్రమాదాలు అడవుల్లో జరిగాయి. తెలంగాణ విషయానికి వస్తే 2019–20లో 12,312లు కాగా, 2020–21లో 18,237, 2021–22లో 13,737, 2022–23లో 13,117, 2023–24లో 13,479లతో దేశంలో ఏడో స్థానంలో ఉంది. ఉత్తరాఖండ్లో మొదటి సంవత్సరంలో 759గా ఉన్న ప్రమాదాల సంఖ్య 2023–24 నాటికి 21,033కు చేరింది. ఇలా పలు రాష్ట్రాల్లో అడవులు అంటుకున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
చదవండి: గద్వాలకు.. ప్రత్యేక సం‘స్థానం’
అడవుల్లో అగ్నిప్రమాదాలు.. అందరికీ చేటే..
అడవులు అంటుకోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది.. ఇది చాలా కారణాల వల్ల జరుగుతుంది. ఉదాహరణకు అడవి కబ్జా ప్రయత్నాలతోపాటు సాధారణంగా చేసే పనుల వల్ల కూడా అడవి అంటుకుంటే.. అది పర్యావరణానికి, స్థానిక ప్రజలకు చాలా నష్టం కలిగిస్తుంది. అడవిలో అగ్నిప్రమాదాలు తరచూ జరుగుతాయి. ఇవి సహజంగా లేదా మానవుల నిర్లక్ష్యం వల్ల జరగవచ్చు. ఉదాహరణకు, ఎండిన ఆకులు, గడ్డిపై నిప్పు పడడం వల్ల అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి.. లేదా కొంతమంది ఆకతాయి యువకులు అడవిలో మద్యం తాగి, సిగరెట్ పడేయడం వల్ల కూడా జరుగుతాయి. కొందరు అడవిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ, అడవిని తగలబెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అటవీ అధికారులు.. అప్రమత్తంగా లేకపోతే అడవులు అంటుకునే ప్రమాదం పెరుగుతుంది.
– కె.పురుషోత్తం, అధ్యక్షుడు, అటవీ, పర్యావరణ పరిరక్షణ కమిటీ