Ganesh immersion: గణేశ్‌ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు | Ready To Ganesh immersion | Sakshi
Sakshi News home page

Ganesh immersion: గణేశ్‌ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు

Sep 15 2024 7:21 AM | Updated on Sep 15 2024 11:08 AM

Ready To Ganesh immersion

భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతులు

వివిధ విభాగాలతో జీహెచ్‌ఎంసీ చర్యలు

 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 17న జరిగే గణేశ్‌ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు జీహెచ్‌ఎంసీ సన్నద్ధమవుతోంది. ఎప్పటి మాదిరిగానే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్‌ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్‌ఎండీఏ, వాటర్‌బోర్డు, మెడికల్‌ అండ్‌ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్,  ఆర్టీసీ, ఎస్‌పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, టూరిజం విభాగాలతోపాటు 108 ఈఎంఆర్‌ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పను లు చేయనున్నారు.

 జీహెచ్‌ఎంసీ జోన్లు, సర్కిళ్ల పరిధుల్లోనూ నిమజ్జనాలు జరిగే ప్రాంతాలవారీగా ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. గణేశ్‌ శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దారి పొడవునా దాదాపు కిలోమీటరుకు ఒక గ్రూపుచొప్పున పారిశుద్ధ్య కార్మికులతో గ్రూపులు ఏర్పాటు చేశారు. గణేశ్‌ యాక్షన్‌ టీమ్స్‌ పేరిట ఇవి మూడు షిఫ్టుల్లో పని చేస్తాయి. ఒక్కో టీమ్‌లో ప్రాంతాన్ని, అవసరాన్ని బట్టి అయిదుగురు నుంచి పన్నెండు మంది వరకు కారి్మకులుంటారు. దాదాపు మూడు వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధుల్లో పాల్గొంటారు.   

ఇబ్బందులు తలెత్తకుండా: ఆమ్రపాలి 
శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి తెలిపారు. నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు సహకరించాలని కోరారు. మండపాల నుంచి నిమజ్జనాలు జరిగే చెరువులు, కొలనుల దాకా భక్తులకు సమస్యలు లేకుండా రహదారి మరమ్మతులు, వీధి దీపాలు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర పనులకు పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, విద్యుత్‌ సిబ్బంది, జీవవైవిధ్య విభాగం, ఇంజినీర్లు కమిటీగా ఏర్పడి మండపాల నిర్వాహకుల సూచనల మేరకు తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.  

73 కొలనుల్లో ఏర్పాట్లు.. 
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడి ప్రజలక్కడే నిమజ్జనాలు చేసేందుకు వీలుగా  73 కొలనుల్లో నిమజ్జనాలకు ఏర్పాటు చేసినట్లు ఆమ్రపాలి పేర్కొన్నారు. వాటిలో  27 బేబీ  పాండ్స్, 24 పోర్టబుల్‌ పాండ్స్,  22 తాత్కాలిక కొలనులు ఉన్నాయన్నారు. వీటితోపాటు 5 పెద్ద చెరువుల (సరూర్‌ నగర్, జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్, బహదూర్‌పురా మీరాలం చెరువు,  కాప్రా ఊర చెరువు) వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద విద్యుత్, 24 గంటల పాటు  తాగునీరు అందుబాటులో ఉండేలా, పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగేలా అవసరమైన సిబ్బంది, సామగ్రి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 140 స్టాటిక్‌ క్రేన్‌లు, 295 మొబైల్‌ క్రేన్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో భోజన సదుపాయాలు కలి్పంచనున్నట్లు పేర్కొన్నారు.  

నమో.. మహా గణనాథా 
ఒక్కరోజే  4 లక్షల మంది భక్తులు 
ఖైరతాబాద్‌: మహా గణపతి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తడంతో ప్రాంగణమంతా జనసంద్రాన్ని తలపించింది. సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచి్చనట్లు అంచనా. ఖైరతాబాద్‌ ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్ల నుంచి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఖైరతాబాద్‌ రైల్వేగేట్‌ రోడ్డంతా కిక్కిరిసిపోయింది. మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతుండటంతో సోమవారం దర్శనం ఉండదని సైఫాబాద్‌ ఏసీపీ ఆర్‌.సంజయ్‌కుమార్‌ తెలిపారు. నిర్వాహకులు మాత్రం సోమవారం భక్తులు మహా గణపతిని దూరం నుంచి దర్శించుకోవచ్చన్నారు.

బాలాపూర్‌ నుంచి.. ట్యాంక్‌బండ్‌ వరకు 
నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన డీజీపీ, సీపీలు  
చాంద్రాయణగుట్ట/పహాడీషరీఫ్‌: ఈ నెల 17న జరిగే బాలానగర్‌ వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం శనివారం ప్రధాన మార్గాన్ని పరిశీలించింది. హైదరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు సి.వి.ఆనంద్, సు«దీర్‌ బాబు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, అదనపు సీపీలు (శాంతి భద్రతలు) విక్రం సింగ్, పి.విశ్వప్రసాద్‌ (ట్రాఫిక్‌)లు ఇతర శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు బాలాపూర్‌ గణనాథుడికి పూజలు చేశారు. అనంతరం  నిమజ్జనం రూట్‌లోని రాయల్‌ కాలనీ, గుర్రం చెరువు కట్ట, బార్కాస్, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌లి, శంషీర్‌గంజ్, అలియాబాద్, సయ్యద్‌ అలీ చబుత్రా, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, చారి్మనార్, గుల్జార్‌హౌజ్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, తెలుగు తల్లి జంక్షన్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ వరకు 19 కిలోమీటర్ల రూట్‌ను పరిశీలించారు. అధికారులతో మహేశ్వరం, సౌత్, సౌత్‌ ఈస్ట్‌ డీసీపీలు సునీతా రెడ్డి, స్నేహ మెహ్రా, కాంతిలాల్‌ సుభాష్‌ పాటిల్, బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాత ్డ ఉన్నారు. 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.  

👉   రహదారులపై వ్యర్థాలు తొలగించేందుకు గణేశ్‌ యాక్షన్‌ టీమ్‌లు 160. 
👉    అందుబాటులో ఉంచిన మినీ టిప్పర్లు 102, జేసీబీలు 125.  
👉    మొబైల్‌ టాయ్‌లెట్స్‌ 309 
👉    తాత్కాలిక వీధి దీపాలు 52,270.  
👉    రోడ్ల మరమ్మతులు, ప్యాచ్‌వర్క్స్‌కు సంబంధించిన పనులు 172.  
👉    వీటికి చేసిన వ్యయం రూ.12.77 కోట్లు. 
👉    రవాణాకు సంబంధించిన పనులు 36. వ్యయం రూ.16.35 కోట్లు. 
పనులన్నీ పూర్తయినట్లు జీహెచ్‌ఎంసీ చెబుతున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి. ప్యాచ్‌వర్క్‌ పనులు పూర్తి కాలేదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement