ఖిలా వరంగల్: వరంగల్ ఎస్ఆర్ఆర్తోట సమీపంలోని ఓ కిరాణా షాపులో ఆదివారం కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. బాధితుడి కథనం ప్రకారం.. కిరాణా షాపులో పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ప్యాకెట్ను కట్ చేయగా అందులో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. వెంటనే అతడు కిరాణా యజమానిని నిలదీసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు పెరుగు ప్యాకెట్ విక్రయించిన షాపును పరిశీలించారు.
వెంటనే ఆ బ్యాచ్కి సంబంధించిన ప్యాకెట్ల అమ్మకాలు నిలిపివేశారు. జనగామలో 50 ప్యాకెట్లు, కరీమాబాద్, లక్ష్మీపురం మార్కెట్ ఏరియా, హనుమకొండ భవానీనగర్లోని షాపుల్లో ఆ బ్యాచ్కి చెందిన పెరుగు ప్యాకెట్లను సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విక్రయించొద్దని షాపు నిర్వాహకులను ఆదేశించారు. వరంగల్ జిల్లా ఫుడ్ ఆఫీసర్ మౌనిక కరీమాబాద్లో తనిఖీలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నామని, ఆ బ్యాచ్కు సంబంధించిన పెరుగు అమ్మకాలు నిలిపివేసి శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్ పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు.


