యాదాద్రి ఎంఎంటీఎస్‌కు కిషన్‌రెడ్డి అడ్డంకి | Railway Minister Ashwini Vaishnaw Petition on projects: Komatireddy Venkat Reddy | Sakshi
Sakshi News home page

యాదాద్రి ఎంఎంటీఎస్‌కు కిషన్‌రెడ్డి అడ్డంకి

Mar 9 2025 4:53 AM | Updated on Mar 9 2025 4:53 AM

Railway Minister Ashwini Vaishnaw Petition on projects: Komatireddy Venkat Reddy

అశ్వినీ వైష్ణవ్‌కు వినతి పత్రం అందజేస్తున్న కోమటిరెడ్డి, సీతక్క, కావ్య, చామల కిరణ్‌

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌కి ప్రాజెక్టులపై వినతిపత్రం

శంషాబాద్‌: ‘నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేకమార్లు రైల్వేమంత్రికి చేసిన విన్నపంతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ మంజూరైంది. కానీ ఆ పనులు ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డియే. ప్రతి ఆదివారం యాదాద్రికి లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 

శనివారం మహబూబ్‌నగర్‌ పర్యటనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని లాంజ్‌లో కలసి రైల్వే ప్రాజెక్టులపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వరంగల్‌ ఎయిర్‌పోర్టు మంజూరు కోసం జీఎంఆర్‌ సంస్థ అభ్యంతరాన్ని పరిష్కరించి.. వారిని ఒప్పించింది తామేనన్నారు.

ఇప్పటికే భూసేకరణ కోసం రూ. 2 వేల కోట్లు కూడా ప్రభుత్వం కేటాయించిందన్నారు. మరో మూడు నెలల్లో కొత్తగూడెం విమానాశ్రయం కూడా మంజూరవుతుందని అశాభావం వ్యక్తం చేశారు. వరంగల్‌లో రీజినల్‌ రింగురోడ్డుకు రైల్వేరింగు రోడ్డు కూడా ఏర్పాటు చేసుకునేందుకు రైల్వేమంత్రి అంగీకరించారన్నారు. 

సానుకూలంగా స్పందించారు..
తాము చేసిన అన్ని వినతులకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వరంగల్‌ అభివృద్ధి ఉత్తి మాటలకే పరిమితమైందని మంత్రి సీతక్క విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement