ఆస్తిలో వాటా ఇవ్వాలని..

Property Disputes: Son Suicide Attempt Drama In Khammam - Sakshi

సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం): ఆస్తిలో తనకూ వాటా ఇవ్వాలంటూ ఓ వ్యక్తి భవనమెక్కి హల్‌చల్‌ చేసిన సంఘటన సత్తుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్‌–4కు చెందిన గుణగంటి రామకృష్ణ పదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులతో అతనికి సంబంధాలు నిలిచిపోయాయి. ఇటీవల తండ్రి ఆస్తిని ఇద్దరు కూతుళ్లకు పంచుతున్న క్రమంలో తనకూ వాటా ఇవ్వాలని వారం రోజులపాటు ఇంటి ముందు వరండాపైనే ఆందోళన చేశాడు.

సమస్య పరిష్కా రం కాకపోవడంతో ఆదివారం ఉదయం కిరోసిన్‌ డబ్బా పట్టుకుని తన ఇంటి డాబా ఎక్కాడు. ఆస్తిలో వాటా ఇవ్వకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. సత్తుపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్, చల్లగుళ్ల నర్సింహారావు, గాదె సత్యం తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. కాగా రామకృష్ణను మాటల్లో పెట్టి రామిశెట్టి కృష్ణమూర్తి అనే వ్యక్తి వెనుకవైపు నుంచి వెళ్లి గట్టిగా పట్టుకుని రక్షించాడు.

పెద్దల సమక్షంలో ఆస్తిలో వాటా ఇస్తామని హామీ పత్రం రాసి ఇవ్వటంతో.. సుమారు ఐదు గంటలపాటు నడిచిన హైడ్రామా సద్దుమణిగింది. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఎటువంటి ప్రమాదం జరగకుండా వల ఏర్పాటు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top