డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు | Private Hospital Staff Attack Patient In Kamareddy, More Details Inside | Sakshi
Sakshi News home page

డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు

Sep 23 2024 7:58 AM | Updated on Sep 23 2024 10:45 AM

private hospital staff attack patient in kamareddy

కామారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఘటన 

ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్న బాధితుడు 

కామారెడ్డిలోని ప్రైవేట్‌ ఆస్పత్రి సిబ్బందితో బాధితుడి స్నేహితుల వాగ్వాదం  

కామారెడ్డి టౌన్‌: గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. కామారెడ్డి పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రికి వెళ్లాడు. 

కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.300 చెల్లించాడు. ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారు. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. 

దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. ఈ చర్యతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి పంపించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. సుమారు అరగంటపాటు అతని ఆందోళన కొనసాగింది. అనంతరం బాధితుడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు.   

Advertisement
 
Advertisement
Advertisement