
హైదరాబాద్కు చేరుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు
విచారణకు ప్రశ్నావళి సిద్ధం చేసుకున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఆయనపై ఎల్ఓసీ, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించిన పోలీసులు ఆయన పాస్పోర్టునూ రద్దు చేయించారు.
గత నెల్లో సుప్రీంకోర్టు స్వల్ప ఊరట ఇవ్వడంతో ప్రభాకర్రావు భారత్కు వచ్చేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఆయన అమెరికాలోని భారత ఎంబసీకి పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకుని, గత శుక్రవారం ఎమర్జెన్సీ సర్టిఫికెట్ పొందారు. దీని ఆధారంగా ఆయన ఆదివారం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. నిరీ్ణత గడువులోగా సిట్ ఎదుట వి చారణకు హాజరుకావాల్సి ఉండటంతో సోమ వారం జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాల యానికి రానున్నారని సమాచారం. అక్కడే అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారు.
అన్ని నివేదికలు క్రోడీకరించి...
ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత పోలీసులు నలుగురు నిందితులు పి.రాధాకిషన్రావు, ఎన్.భుజంగరావు, ఎం.తిరుపతన్న, డి.ప్రణీత్రావులను అరెస్టు చేశారు. మరో నిందితుడు శ్రవణ్కుమార్రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఐదుగురితోపాటు పదుల సంఖ్యలో సాక్షుల్ని విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. టెలికం సరీ్వసు ప్రొవైడర్లతోపాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి అనేక నివేదికలు పొందారు. వీటన్నింటినీ క్రోడీకరించిన పోలీసులు ప్రభాకర్రావును ప్రశ్నించడానికి ప్రశ్నావళి సిద్ధం చేశారు.
వీటి ఆధారంగా ఆయన్ను సుదీర్ఘంగా విచారించాల్సి ఉందని, అవసరమైతే ఆయన రెండు మూడుసార్లు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అరెస్ట్ నుంచి ఊరట ఇస్తూ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆయనకు షరతు విధించింది. ఆగస్టు 5న ఆయన దాఖలు చేసిన పిటిషన్ను మరోసారి విచారించనుంది. ఈలోపు ప్రభాకర్రావు విచారణకు సహకరించకుంటే ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి కస్టోడియల్ విచారణకు అనుమతి కోరతామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు అన్నారు.

హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్
శంషాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్రావు హైదరాబాద్ చేరుకున్నారు. పదిహేను నెలల తర్వాత ఆయన ఆదివారం రాత్రి 7.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనపై లుక్ఔట్ నోటీసులు ఉండటంతో ఎయిర్పోర్టులోని ఇమిగ్రేషన్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. రాత్రి 10.30 గంటల వరకు కూడా అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. విచారణ అనంతరం సిట్ బృందం ఆయనను అదుపులోకి తీసుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది.