డబ్బు అంటే కార్పొరేటర్‌కు కూడా చేదు కాదు కదా! | Peddapalli RDO Shankar kumars comments on Pension Gone Viral | Sakshi
Sakshi News home page

డబ్బు అంటే కార్పొరేటర్‌కు కూడా చేదు కాదు కదా!

Jan 8 2021 8:16 AM | Updated on Jan 8 2021 11:05 AM

Peddapalli RDO Shankar kumars comments on Pension Gone  Viral  - Sakshi

ఫెర్టిలైజర్‌సిటీ (రామగుండం): ‘‘మీరు డబ్బులు తీసుకుని ఓటేశారు.. అందుకు కార్పొరేటర్‌ పని చేయమంటే ఇప్పుడు డబ్బులు అడుగుతున్నడు..’’ఇదీ పింఛన్‌ ఇప్పించండి సారూ..అంటూ వేడుకున్న ఓ వృద్ధురాలికి ఆర్డీవో ఇచ్చిన సమాధానం.  ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ 39వ డివిజన్‌లోని మాతంగి కాలనీకి మంగళవారం పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్‌ భూములపై విచారణకోసం వచ్చారు. ఈ సమయంలో ఓ వృద్ధురాలు పింఛన్‌ ఇప్పించాలని ఆర్డీవోను వేడుకుంది. అక్కడే ఉన్న మరో మహిళ మాట్లాడుతూ.. కార్పొరేటర్‌ను అడిగితే రూ.2 వేలు లంచం అడుగుతున్నాడని తెలిపింది. దీంతో ‘మీరు ఓటు వేసేటప్పుడు డబ్బులు తీసుకోలేదా’ అని ఆర్డీవో ప్రశ్నించారు.

‘మేము అడగలేదు, వాళ్లే ఇచ్చి వెళ్లారు.. డబ్బులంటే ఎవరికి చేదు సారు.. కూలీ చేసుకుని బతికేటోళ్లం.. అందుకే పైసలు తీసుకున్నం’ అని ఆ మహిళ బదులిచ్చింది. ‘మీరు డబ్బులు తీసుకుని ఓటు వేశారు.. అందుకు కార్పొరేటర్‌ ఇప్పుడు పని చేయమంటే డబ్బులు అడుగుతున్నడు.. డబ్బు అంటే కార్పొరేటర్‌కు కూడా చేదు కాదు కదా’ అని ఆర్డీవో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో స్థానికంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ అంశంపై ఆర్డీవో స్పందిస్తూ ‘డబ్బులు తీసుకుని ఓటేసినందుకు ప్రశ్నించే హక్కుని కోల్పోయారు..’అని వారికి తెలియజేశానని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement