ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు | Organic Millet And Pulses Farming By Womens In Zaheerabad Area | Sakshi
Sakshi News home page

ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు

Jan 18 2023 2:04 AM | Updated on Jan 18 2023 10:37 AM

Organic Millet And Pulses Farming By Womens In Zaheerabad Area - Sakshi

పాతపంటల జాతరలో భాగంగా చిరు ధాన్యాలను ఎడ్లబండ్లపై పెట్టుకొని ఊరేగిస్తూ రైతుల్లో అవగాహన కల్పిస్తున్న దృశ్యం   

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సామలు.. కొర్రలు.. అరికెలు.. ఊదలు.. జొన్నలు.. ఇలా పలు పాత పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని వినియోగిస్తూ తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆ మహిళా రైతులు. అంతేకాదు వారి అవసరాలు పోను మిగతా ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జించడంతో పాటు ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు.

చాలా ప్రాంతాల్లో ఈ పాత పంటల సాగు దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో చాలామంది తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీటి సాగు మొదలైంది. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంత రైతులు మాత్రం ఏళ్ల తరబడి తృణ ధాన్యాల సాగును కొనసాగిస్తుండటం గమనార్హం. 

ఒక సంఘం..3 వేలమంది సభ్యులు 
జహీరాబాద్‌ ప్రాంతంలో సరైన సాగునీటి సౌకర్యం లేదు. వరుణుడు కరుణిస్తేనే పంటలు చేతికందుతాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ పంటలను పండిస్తున్నారు. డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రూపుల్లో సుమారు మూడు వేల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు.  

ఒక్క కరోనా మరణం లేదు 
చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా రూ.లక్షల్లో లాభాలను గడించకపోయినప్పటికీ.. నిత్యం వాటినే వినియోగిస్తుండడంతో ఆ రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఈ చిరుధాన్యాలు వినియోగించిన రైతు కుటుంబంలో ఒక్క కరోనా మరణం కూడా జరగలేదని డీడీఎస్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మూడు వేవ్‌ల్లో అసలు ఈ మహమ్మారి బారిన పడిన రైతులే చాలా తక్కువని చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా తక్కువేనని అంటున్నారు. 

కొనసాగుతున్న జాతర 
చిరుధాన్యాల ఆవశ్యకత.. పౌష్టికాహార భద్రత.. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా పాత పంటల జాతర జహీరాబాద్‌ ప్రాంతంలో కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి కనీసం రోజుకో గ్రామం చొప్పున నెల రోజుల పాటు సుమారు 40 గ్రామాల్లో ఈ జాతర సాగుతుంది. సుమారు 80 రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లపై ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వాటి సాగు ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తుంటారు.

డీడీఎస్‌ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం.. రసాయనాలు లేకుండా విత్తనాలు భధ్ర పరుచుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. జహీరాబాద్‌ కేంద్రంగా ఈ సంస్థ 35 గ్రామాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్‌కల్‌ తదితర మండలాల రైతులకు తృణధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తోంది. పండిన పంటలు రైతులు వినియోగించేలా వారిని చైతన్యం చేస్తోంది. మిగిలిన పంటలను మార్కెట్‌ ధర కంటే సుమారు పది శాతం ఎక్కువ ధరకు రైతుల వద్ద డీడీఎస్‌ కొనుగోలు చేస్తోంది. 

మేం పండించిన సాయి జొన్నలనే తింటున్నం..  
నాకు ఏడు ఎకరాలు ఉంది. టమాటా, మిర్చి వంటి కూరగాయల పంటలకు భూమి అనుకూలంగా ఉన్నప్పటికీ.. చిరుధాన్యాలను సాగు చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల్లో సాయి జొన్న పండిస్తున్న. కూరగాయల పంటలతో పాటు శనగలు, కందులు కూడా సాగు చేస్తున్నా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో మేం పండించిన సాయి జొన్నలనే ఎక్కువగా తింటాం. ఇవి తింటేనే మాకు ఆరోగ్యంగా అనిపిస్తుంది.  
– గార్లపాటి నర్సింహులు, బర్దిపూర్, సంగారెడ్డి జిల్లా 

ఐదు ఎకరాల్లో 20 రకాల పంటలు  
మాకు ఐదు ఎకరాలుంది. వర్షం పడితేనే పంట పండుతుంది. నీటి సౌకర్యం లేదు. తొగర్లు, జొన్నలు, సామలు, కొర్రలు.. ఇట్లా 20 రకాల పంటలు వేస్తున్నాం. విత్తనాలు మావే.. కొనే అవసరం లేదు. మేమే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. దీంతో పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉంటోంది.  
– పర్మన్‌గారి నర్సమ్మ, మెటల్‌కుంట, సంగారెడ్డి జిల్లా 

ఎంతో ఆరోగ్యంతో ఉంటున్నారు.. 
నెల రోజుల పాటు జరిగే పాతపంటల జాతరలో రైతులకు చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా.. మరో పంట చేతికందుతుంది. ఈ చిరుధాన్యాలను పండించడంతో పాటు వాటిని వినియోగిస్తే వచ్చే ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై మహిళా రైతులను చైతన్యం చేస్తున్నాం. చిరు ధాన్యాలను వినియోగిస్తున్న రైతులు, వారి కుటుంబాల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. 
– బూచనెల్లి చుక్కమ్మ, జాతర కోఆర్డినేటర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement