ముత్యంరెడ్డి, కల్పన, పండరి
ఆపై జేసీబీతో గొయ్యితీసి శవం పూడ్చివేత
నారాయణఖేడ్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎల్గోయి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ హత్య ఉదంతం తొమ్మిది రోజుల అనంతరం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మనూరు మండల కేంద్రానికి చెందిన కల్పనకు నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన చంబనోళ్ల ముత్యంరెడ్డి (36)తో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పదేళ్లలోపు కూతురు, కుమారు డు ఉన్నాడు.
మృతుడు ముత్యంరెడ్డి నారాయణఖేడ్ పట్టణంలో మోటారు వైండింగ్ మెకానిక్గా పనిచేస్తున్నా డు. కల్పన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసి ఈ మధ్య కాలంలో ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా చేరింది. కాగా ఈ నెల 16వ తేదీ నుంచి ముత్యంరెడ్డి కనిపించకుండా పోయాడు. దీంతో తన భర్త కనిపించడం లేదని కుటుంబీకులతో కలిసి కల్పన నారాయణఖేడ్ పోలీస్స్టేషన్లో ఈ నెల 18న ఫిర్యాదు చేసింది.
పోలీసులు ముత్యంరెడ్డి కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో కేసును సవాల్గా తీసుకున్నారు. భార్య కల్పన ఫోన్ కాల్స్పై నిఘాపెట్టగా 16న తన ప్రియుడైన మనూరు మండలం ఎల్గోయికి చెందిన గైని పండరి అలియాస్ చింటుతో చాలా సార్లు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా ముత్యంరెడ్డిని హత్యచేసి ఎల్గోయిలోని పండరి చేనులో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు నేరం అంగీకరించారు. పోలీసులు ఆదివారం గోతిలోంచి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


