షర్ఫొద్దీన్, షాహిన్ (ఫైల్)
వేర్వేరు చోట్ల భర్తల అఘాయిత్యాలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల)/కొండాపూర్(సంగారెడ్డి): ఒకేరోజు.. వేర్వేరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో భర్తలు తమ భార్యల్ని కడతేర్చి తామూ బలవన్మరణానికి పాల్పడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన మహ్మద్ షర్ఫొద్దీన్ (60)కి మండెపల్లికి చెందిన షాహిన్ (55)కి 40 ఏళ్ల క్రితం వివాహమైంది. షర్ఫొద్దీన్ ఇల్లరికంగా మండెపల్లికి వచ్చాడు. వారికి ఇద్దరు కూతుళ్లు కరిష్మా, షాహిన్.. వీరిద్దరికీ వివాహాలయ్యాయి. షర్ఫొద్దీన్ హోటల్లో వంట మనిషిగా, షాహిన్ కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు.

కాగా శుక్రవారం ఎప్పటిలాగే పనులకు వెళ్లిన దంపతులు మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్లి సాయంత్రం వరకు బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కలవారు కిటికీలో నుంచి చూడగా ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ ఉపేంద్రచారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. షాహిన్ను నేలకు బాది హత్యచేసిన తర్వాత షర్ఫొద్దీన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కూతుళ్ల వివాహాలకు రూ.5 లక్షల వరకు అప్పు ఉండడంతో మనస్థాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన అంజయ్య (25)కు నారాయణ్ఖేడ్కు చెందిన యాదమ్మ (21)తో సుమారు 11 నెలల క్రితం వివాహమైంది. అంజయ్య తన భార్యతో పాటు తమ్ముడు గణేశ్, అమ్మ యాదమ్మతో కలిసి మారేపల్లి శివారులో ఓ మామిడి తోటను కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం అంజయ్య తల్లి యాదమ్మ మామిడి పండ్లను విక్రయించేందుకు సదాశివపేటకు వెళ్లింది.
తమ్ముడు గణేశ్ ఇంట్లో ఉండగానే తనకు బైక్ కొనివ్వలేదని అంజయ్య తన భార్యతో గొడవకు దిగాడు. మాటామాటా పెరిగి క్షణికావేశంలో తన భార్యకు ఉరివేసి చంపాడు. అనంతరం తాను కూడా భార్య చీరతో తోటలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకున్నాడని సీఐ సుమన్కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సత్తయ్య పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. మృతురాలి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


