ఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్ను పొన్నూరు మహిళ రైతులు కలిశారు. మామిళ్లపల్లిలో మహిళలపై పోలీసులు చేసిన దాడిని వివరించారు. పొన్నూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ అంబటి మురళీకృష్ణ నేతృత్వంలో మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘాలను కలిసి బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు.
అనంతరం మహిళా రైతులు మీడియాతో మాట్లాడుతూ.. మమ్మల్ని కిందపడేసి పోలీసులు కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలబడుతున్న వైఎస్సార్సీపీ నేతలను లోపలికి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ‘‘మా పంట మేము నిల్వ చేసుకోవడమే నేరమా?. మాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. పొలాల్లో పని చేసే మహిళలను దారుణంగా కొట్టారు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం’’ అని మహిళా రైతులు విజ్ఞప్తి చేశారు.
పొన్నూరు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘మామిళ్లపల్లిలో మహిళలు, రైతులపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. బాధిత మహిళలపైనే తిరిగి కేసులు పెట్టారు. వెంటనే మహిళలపై పెట్టిన కేసులను ఉపసంహరించాలి. దాడి చేసిన పోలీసులపైన 307 కేసులు పెట్టాలి. న్యాయం చేయమని కోరితే రాష్ట్రంలో చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే ఉంది. అందుకే మేమందరం ఢిల్లీకి వచ్చి కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశాం. పోలీసులు దౌర్జన్యాన్ని తగిన రీతిలో చర్యలు తీసుకుంటామని మానవ హక్కుల సంఘం హామీ ఇచ్చింది. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు వివిధ కమిషన్లను కలిసి మహిళలు ఫిర్యాదు చేశారు.
మొక్కజొన్నలు రైతుల వద్ద తక్కువ ధరకు కొని టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. బాధిత మహిళ రైతులు చాలామంది కాపులే ఉన్నారు. కాపు ఫ్యాక్టరీ పేరుతో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ ఒక పావుగా మారారు. మొక్కజొన్న రైతులకు న్యాయం చేసేందుకు కనీసం ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు’’ అంటూ అంబటి మురళీకృష్ణ మండిపడ్డారు.


