
ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
డీఎంఈ పరిధిలో 2,280 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు
మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
పలువురు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 10 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ బోర్డు కార్యదర్శి గోపాకాంత్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 17. వైద్య విద్యలో పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ కోర్సు చేసినవారు ఈ పోస్టులకు అర్హులు.
మెడికల్ కాలేజీల్లో మరో 714 అసెస్టింట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటిని కూడా త్వరలోనే భర్తీ చేసేందుకు బోర్డు నోటిఫికేషన్ ఇవ్వనుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో బోధన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముందుగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేయడం ద్వారా ఇప్పటికే విధుల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
2,258 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం
రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించి క్యాడర్ స్ట్రెంత్ను 3,696గా లెక్క తేల్చారు. ప్రస్తుతం 1,390 మంది అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా రెగ్యులర్ బేసిస్లో పనిచేస్తున్నారు. మరో 985 మంది కాంట్రాక్టు ప్రాతిపదికన విధుల్లో ఉన్నారు. కాగా 34 వైద్య కళాశాలలకు 2,288 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమని ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ నివేదిక సమర్పించింది.
దీంతో మొదటగా 607 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే మరో 714 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తంగా 1,321 మంది కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా విధుల్లో చేరుతారు. ఆ వెంటనే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లలో అర్హులైన 231 మందిని అసోసియేట్ ప్రొపెసర్లుగా నియమిస్తారు. ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఉన్నవారిలో 308 మందిని ప్రొఫెసర్లుగా నియమించనున్నారు.
డీపీసీ ప్యానల్ 349 మందిని పదోన్నతులకు అర్హులుగా గుర్తించినప్పటికీ, తొలుత 308 మందికి మాత్రమే పదోన్నతులు కల్పించనున్నారు. కాగా, ఇప్పుడున్న ప్రొఫెసర్లలో 44 మందిని అదనపు డీఎంఈలుగా పదోన్నతి కల్పించి, బోధనాసుపత్రులకు సూపరింటెండెంట్లుగా, ప్రిన్సిపాళ్లుగా నియమిస్తారు.
రెండు రోజుల క్రితమే 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 2 స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, గడిచిన 17 నెలల్లో ఆరోగ్య శాఖలో 8 వేలకు పైగా వివిధ పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవి కాకుండా మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్మసిస్ట్, 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 1,931 మల్టీ పర్పస్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది.