బోనస్‌.. మైనస్‌ | No Bonus Of Rs 500 For Farmer in Telangana | Sakshi
Sakshi News home page

బోనస్‌.. మైనస్‌

Jun 6 2025 5:03 AM | Updated on Jun 6 2025 5:03 AM

No Bonus Of Rs 500 For Farmer in Telangana

యాసంగి రైతులఖాతాల్లోకి చేరని బోనస్‌ 

3.66 లక్షల మందికి రూ. 1,110.19 కోట్లు పెండింగ్‌ 

బోనస్‌ కోసం అన్నదాతల ఎదురుచూపులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్రవ్యాప్తంగా సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు ఇంకా బోనస్‌ పైకం చేరలేదు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాకు రూ. 500 బోనస్‌ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కానీ నెలన్నరగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క రైతుకూ ప్రభుత్వం సన్నాల బోనస్‌ ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో కూడా స్పష్టత లేకపోవడంతో రైతులు ఎదురు చూస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 3,66,491 మంది రైతుల నుంచి 22.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం సేకరించిన ప్రభుత్వం బోనస్‌ కింద రూ. 1110.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. సన్నరకం ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ఎప్పటికప్పుడు పంపిస్తున్నామని, ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాగానే రైతుల ఖాతాల్లో పడేలా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఓ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.  

ఈ ఫొటోలోని రైతు పేరు కట్కూరి జయపాల్‌రెడ్డి. హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన ఆయన ఏడెకరాల్లో సన్న, దొడ్డు రకం వరి సాగు చేశాడు. రెండున్నర ఎకరాల్లో 57 క్వింటాళ్ల వడ్లు రాగా కొనుగోలు కేంద్రంలో నెల క్రితం విక్రయించాడు. ఆన్‌లైన్‌ ప్రొక్యూ ర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఓపీఎంఎస్‌) ద్వారా డబ్బులు ఖాతాలో పడ్డాయి. అయితే ప్రభుత్వం సన్న వడ్లకు ఇస్తామన్నక్వింటాకు రూ. 500 బోనస్‌ మాత్రం ఇప్పటివరకు పడలేదు. వానాకాలం పనులు మొదలవడంతో ప్రభుత్వం తన బోనస్‌ డబ్బు రూ. 28,500 ఇస్తే పంట పెట్టుబడులకు పనికొస్తాయని జయపాల్‌రెడ్డి అంటున్నాడు.

బోనస్‌ డబ్బులు పడలేదు..
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఎకరంన్నరలో సన్న వడ్లు, మూడు ఎకరాల్లో దొడ్డు ధాన్యం సాగు చేశా. సన్నాల దిగుబడి 24 క్వింటాళ్లు వచ్చింది. తినేందుకు 12 క్వింటాళ్లు నిల్వ చేసు కున్నాం. వానాకాలం పెట్టుబడి కోసం మిగిలిన 12 క్వింటాళ్ల సన్నధాన్యాన్ని 20 రోజుల క్రితం ఐకేపీ సెంటర్‌లో విక్రయించా. రూ. 500 చొప్పున బోనస్‌ పడలేదు. ఈ పైసలు వస్తే పెట్టుబడికి ఎవరినీ అడగకుండా ఉంటది. – నీల సంపత్, అబ్దుల్‌నాగారం, తరిగొప్పుల మండలం, జనగామ జిల్లా 
 

Advertisement
 
Advertisement
Advertisement