విజయవాడ హైవేపై తగ్గాయి.. మిగతా చోట్ల పెరిగాయి | New toll charges come into effect on national highways in Telangana | Sakshi
Sakshi News home page

విజయవాడ హైవేపై తగ్గాయి.. మిగతా చోట్ల పెరిగాయి

Apr 1 2025 5:40 AM | Updated on Apr 1 2025 5:40 AM

New toll charges come into effect on national highways in Telangana

రాష్ట్రంలోని జాతీయ రహదారులపై అమల్లోకి కొత్త టోల్‌ చార్జీలు 

కొన్నిచోట్ల 3.5 శాతం, మరికొన్ని టోల్‌ప్లాజాల వద్ద 5 శాతం పెరుగుదల 

హైదరాబాద్‌–విజయవాడ మార్గంలో మాత్రం గరిష్టంగా రూ. 160 దాకా తగ్గుదల 

2026 మార్చి 31 వరకు ఇవే చార్జీలు: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/చౌటుప్పల్‌ రూరల్, కేతేపల్లి/రఘునాథపల్లి/దేవరుప్పుల/ఇందల్వాయి: రాష్ట్రంలోని జాతీయ రహదారులపై కొత్త టోల్‌ చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సవరించిన చార్జీలను ప్రకటించింది. దీనిప్రకారం హైదరాబాద్‌– విజయవాడ మార్గంలోని నేషనల్‌ హైవే–65పై కనిష్టంగా రూ. 15 నుంచి గరిష్టంగా రూ. 160 దాకా టోల్‌ చార్జీలు తగ్గాయి. అదే సమయంలో తెలంగాణ మీదుగా సాగే ఇతర హైవేలపై మాత్రం టోల్‌ చార్జీలు 3.5% నుంచి 5% వరకు పెరిగాయి. 

ఎన్‌హెచ్‌ 65పై వాహనదారులకు తగ్గిన భారం.. 
ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయంతో హైదరాబాద్‌–విజయవాడ మార్గంలోని ఎన్‌హెచ్‌–65పై ప్రయాణించే వాహనదారులకు టోల్‌ చార్జీల భారం కాస్త తగ్గింది. ఈ మార్గం మీదుగా 24 గంటల్లోపు తిరుగు ప్రయాణమయ్యే అన్ని రకాల వాహనదారులకు 25 శాతం మేర ఎన్‌హెచ్‌ఏఐ తగ్గింపు ఇచి్చంది. అయితే ఏపీలోని చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద ఒకవైపు రూ. 5, రెండువైపులా రూ.10 మాత్రమే తగ్గించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు గల 181.5 కి.మీ. మేర ఉన్న జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. 

ఎన్‌హెచ్‌ 65పై ఎందుకు తగ్గిందంటే.. 
ఎన్‌హెచ్‌–65 రోడ్డును గతంలో నాలుగు వరుసలుగా విస్తరించారు. ఆ బాధ్యతను టెండర్‌ ద్వారా జీఎంఆర్‌ సంస్థ దక్కించుకొని రూ. 1,741 కోట్లతో పనులు నిర్వహించింది. బీఓటీ పద్ధతిలో పనులు పూర్తయ్యాక 2012 నుంచి టోల్‌ వసూలు మొదలుపెట్టింది. సాధారణంగా రోడ్డు ప్రధాన క్యారేజ్‌వే నిడివి ఆధారంగా టోల్‌ నిర్ధారించే విధానం ఎన్‌హెచ్‌ఏఐలో అమలులో ఉంది. 

కానీ విజయవాడ రోడ్డుపై బైపాస్‌ వ్యయం కూడా కలిపి గతంలో టోల్‌ ధరలు నిర్ధారించారు. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ సహా ఇతర సంస్థల అ«దీనంలోని రోడ్లతో పోలిస్తే వాటి ధరల్లో కొంత ఎక్కువ చార్జీలు ఖరారయ్యాయి. ఇక రోడ్డు నిర్మాణ వ్యయం తిరిగి వసూలయ్యాక టోల్‌ ధరల్లో సహజంగా మార్పు చేస్తారు. ఇప్పుడు ఈ రోడ్డును ఆరు వరుసలకు విస్తరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్‌తో ఉన్న ఒప్పందం రద్దయింది. 

గత 9 నెలలుగా ఒక ఏజెన్సీతో ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ వసూలు చేయిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎన్‌హెచ్‌ఏఐ ఈ జాతీయ రహదారిపై టోల్‌ వసూలును రీనోటిఫై చేసింది. ఇంతకాలం జీఎంఆర్‌ సంస్థ పేరుతో ఉన్న నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రధాన రోడ్డు నిడివి ఆధారంగా ఎన్‌హెచ్‌ఏఐ–2008 ఫీ రూల్స్‌ ప్రకారం ధరలను లెక్కగట్టింది. ఇంతకాలం ఉన్న ధరలతో పోలిస్తే ఇవి తక్కువగా ఖరారు కావడం విశేషం. 

మిగతా చోట్ల.. 
తెలంగాణలోని మంచిర్యాల నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ వెళ్లే జాతీయ రహదారి–363 నిడివి 94 కి.మీ. ఉండగా మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం సరండి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ట్రాఫిక్, రోడ్డు నిర్వహణ తదితరాలను లెక్కగట్టిన ఎన్‌హెచ్‌ అధికారులు ఈ మార్గంలో గతేడాదితో పోలిస్తే కనీసం రూ. 5 నుంచి రూ. 20 వరకు టోల్‌ చార్జీలు పెంచారు. 
⇒ వరంగల్‌–హైదరాబాద్‌ బైపాస్‌ రోడ్డుపై జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌ప్లాజాల్లో 5 శాతం మేర టోల్‌ చార్జీలు పెరిగాయి. 
⇒ హైదరాబాద్‌ నుంచి నాగపూర్‌ వెళ్లే ఎన్‌హెచ్‌–44పై తెలంగాణ పరిధిలోని మార్గంలో 3.5 శాతం మేర టోల్‌ చార్జీలు పెరిగాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement