సాక్షి, హైదరాబాద్: ఈ నెల 29న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈశాన్య రుతుపవన వర్షాలు ఈనెల 28న పలు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా కేరళ రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం కాగా.. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ జరిగింది. ఈనెల 28వ తేదీ నాటికి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల నుంచి, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
