
విమానాలకు అడ్డొచ్చే భవనాల్ని తొలగించాల్సిందే!!
ప్రత్యేక రూల్స్ రూపొందించిన విమానయాన శాఖ
అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలో గత ఉత్తర్వుల్లో కీలక సవరణలు
బేగంపేట ఎయిర్పోర్టు సమీప బస్తీలు, కాలనీల బాధితుల ఆందోళన
హైదరాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో గౌరవ విమానయాన శాఖ ముందస్తు జాగ్రత్తలకు శ్రీకారం చుట్టింది. పౌర విమానాల రాకపోకలకు అడ్డుగా ఉండే భవనాలు చెట్ల తొలగింపులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ’భారతీయ వాయుయాన్ అదినీయం’, 2024 (16 ఆఫ్ 2024)లో కీలక సవరణలు చేపట్టింది. ఈ చట్టంలోని సెక్షన్ 34 పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు నోటీసుల జారీ ప్రక్రియలో పలు సవరణలు చేశారు. ఈ మేరకు రూపొందించిన డ్రాఫ్ట్ రూల్స్తో ఈ నెల 18న ప్రత్యేక గెజిట్ ప్రచురించింది.
ఈ గెజిట్ ప్రచురితమైన 21 రోజుల తర్వాత సంబంధిత రూల్స్ వినియోగంలోకి రానున్నాయి. ఈ గడువులోపు సంబంధిత రూల్స్పై అభ్యంతరాలను వ్యక్తం చేయాల్సిందిగా పేర్కొన్నారు. దీంతో ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బేగంపేట విమానాశ్రయ పరిసరాల్లో బస్తీలు, కాలనీల్లోని వేలాది నిర్మాణాల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. రసూల్పురా, అన్నానగర్ పరిధిలోని వేలాది నిర్మాణాలు పూర్తిగా ఎయిర్పోర్టు స్థలాల్లోనే వెలసినవి కావడం గమనార్హం. కంటోన్మెంట్ పరిధిలోని కాలనీల్లో నిర్మాణాలకు ముందస్తుగానే ఎయిర్పోర్టు అథారిటీ ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను పాక్షికంగా తొలగించాల్సి ఉంటుంది.
ఏమిటీ సవరణలు..
⇒ ‘భారతీయ వాయుయాన్ అదినీయం’, చట్టం సెక్షన్ 18 (1), (3) ప్రకారం సంబంధిత అధికారి విమాన యాన రాకపోకలకు అడ్డంకిగా ఉండే భవనాలు, చెట్ల తొలగింపు నోటీసు జారీ చేస్తారు.
⇒ నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపు సంబంధిత భవనం, చెట్ల యజమాని పూర్తి వివరాలతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ గడువును మరో 60 రోజుల వరకు పెంచే వెసులుబాటు ఉంది.
⇒ నిర్దేశిత గడువులోపు సంబంధిత యజమాని కోరిన వివరాలు సమరి్పంచకపోతే, అధికారులు ఇచ్చిన సమాచారాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
⇒ విమానయాన రాకపోకలకు అడ్డంకిగా ఉన్నట్లు గుర్తించిన ఏదైనా భవనం లేదా చెట్టును సంబంధిత అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది నివేదిక రూపొందిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనకు యజమానులు పూర్తిస్థాయిలో సహకరించాల్సి ఉంటుంది.
⇒ పౌర విమానయాన శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు స్పందించని యజమానులపై జిల్లా కలెక్టర్కు రిపోర్ట్ చేసి, తదుపరి చర్యలు చేపడతారు.
ఆ బస్తీల మనుగడ ప్రశ్నార్థకం
ఈ నిబంధనలపై విమానాశ్రయాల సమీపంలోని భవనాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్
కంటోన్మెంట్లోని యజమానులు నిరసన వెలిబుచ్చుతున్నారు. కంటోన్మెంట్లో భవన నిర్మాణాలకు పౌర విమాన యాన శాఖ నుంచి ముందస్తుగానే ఎన్ఓసీలు తీసుకుంటారు. వారు సూచించిన ఎత్తుకు లోబడే మెజారిటీ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. కొన్ని నిర్మాణాలు మాత్రమే నిర్దేశిత ఎత్తుకంటే ఎక్కువ మోతాదులో ఉన్నాయి. బేగంపేట విమానాశ్రయం చుట్టూ ఉన్న కంటోన్మెంట్ పరిధిలోని నిర్మాణాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.
జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే వేలాది నిర్మాణాలకు ఎయిర్ పోర్టు ఎన్ఓసీ నిబంధన అమల్లో లేదు. పౌర విమానయాన శాఖ తాజా ఉత్తర్వులతో బేగంపేట ఎయిర్పోర్టు చుట్టుపక్కల ఉన్న వేలాది నిర్మాణాలు పాక్షికంగా కూలి్చవేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. నగరం నడి»ొడ్డున ఉన్న బేగంపేట విమానాశ్రయంలో సాధారణ పౌరుల విమానాల రాకపోకలు కొన్ని ఏళ్ల క్రితమే నిలిచిపోయాయి. కేవలం చార్టెడ్ ఫ్లైట్లు, రక్షణ శాఖ విమానాలు మాత్రమే బేగంపేటకు వస్తున్నాయి. వీటి కోసం వేలాది భవనాలను కూల్చివేసే బదులు, ఈ విమానాశ్రయాన్నే తరలించాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బేగంపేట ఎయిర్పోర్టును తరలించండి: వికాస్ మంచ్
సామాన్య పౌరుల రాకపోకలు నిలిచిపోయిన బేగంపేట ఎయిర్పోర్టును పూర్తిగా మూసివేయాల్సిందిగా కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. చార్టెడ్, వివిధ సంస్థలకు చెందిన విమానాల కోసం మాత్రమే వినియోగిస్తున్న బేగంపేట ఎయిర్పోర్టును దుండిగల్ లేదా హకీంపేటకు తరలించాలని కోరారు.