MLC Election Results: సురభి వాణిదేవి విజయం | Sakshi
Sakshi News home page

MLC Election Results: సురభి వాణిదేవి విజయం

Published Sat, Mar 20 2021 5:08 PM

MLC Election Results TRS Vani Devi Win Over BJP Ramchander Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘంగా కొనసాగిన మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించారు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆమె గెలుపు ఖరారైంది.  మరికాసేపట్లో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోవడంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇక వాణిదేవి విజయంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. తెలంగాణ భవన్‌లో కాసేపట్లో విజయోత్సవ సంబరాలకు ఏర్పాట్లు చేస్తుండటంతో, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. 

సురభి వాణిదేవికి వచ్చిన మొత్తం ఓట్లు 1,49,269
♦మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689
♦రెండో ప్రాధాన్యత ఓట్లు 36,580
రాంచందర్‌రావుకు వచ్చిన మొత్తం ఓట్లు 1,37,566
♦మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,04,668
♦రెండో ప్రాధాన్యత ఓట్లు 32,898

కాగా తెలంగాణలో ఈ నెల 14న రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత మూడు రోజులుగా ఓట్ల లెక్కింపు జరుగుతుండగా నేడు, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఫలితం వెలువడింది. ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఫలితం తేలాల్సి ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గెలుపు దిశగా పయనిస్తుండగా, తీన్మార్‌ మల్లన్న రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

చదవండి: మేం నేర్పిన చదువు ఇదేనా: వాణిదేవి అసహనం

Advertisement
Advertisement