
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసు (ఓఎంసీ)లో ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి దోషిగా తేలిన తర్వాత ఆయనకు జైల్లో ఏమీ ప్రత్యేకతలు ఉండవని, ఆయన పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కౌంటర్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్ష అమలును నిలిపివేయాల్సిన అవసరం లేదని చెప్పింది. శిక్షను నిలిపివేయకపోతే తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి ఎలాంటి నష్టం వస్తుందో గాలి జనార్దన్రెడ్డి స్పష్టంగా వివరించలేదని చెప్పింది.
ఓఎంసీ కేసులో దోషులుగా తేలడంతో గాలి జనార్దన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్లకు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు మే 6న ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు తీర్పు చట్టవిరుద్ధమని, దానిని కొట్టివేయాలని కోరారు. అలాగే తమకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్పై మేనెల 21న విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. గాలి జనార్దన్రెడ్డి సహా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని పేర్కొంది. ఎమ్మెల్యేగా కొనసాగడం ప్రాథమిక హక్కు కాదని.. గాలి పిటిషన్కు విచారణార్హత లేదని చెప్పింది. ఈ పిటిషన్పై బుధవారం మరోసారి విచారణ జరిగే అవకాశం ఉంది.