ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే | Miss World 2025 Grand Finale In Hyderabad On May 31st, More Details | Sakshi
Sakshi News home page

ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే

May 31 2025 5:24 AM | Updated on May 31 2025 1:27 PM

Miss World 2025 Grand Finale in Hyderabad on May 31

హైటెక్స్‌లో సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్‌ ఫినాలే 

తుది పోటీలో మిస్‌ ఇండియా నందినీ గుప్తా సహా 40 మంది సుందరీమణులు 

ప్రత్యక్షంగా వీక్షించనున్న మూడున్నర వేల మంది 

ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించనున్న కోట్లాది మంది 

ప్రధాన న్యాయ నిర్ణేతగా సినీ నటుడు సోనూసూద్‌ 

విజేతకు బ్లూ క్రౌన్‌ అలంకరించనున్న మిస్‌ వరల్డ్‌–2024 క్రిస్టీనా

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సుందరి ఎవరో శనివారం తేలబోతోంది. హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ 72వ ఎడిషన్‌ పోటీల గ్రాండ్‌ ఫినాలె (ఫైనల్స్‌) శనివారం రాత్రి జరగబోతోంది. హైటెక్స్‌ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 40 మంది పోటీలో నిలవబోతున్నారు. వారిలో ఒకరు ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి బ్లూ క్రౌన్‌ను సొంతం చేసుకోనున్నారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా దాదాపు మూడున్నర వేల మంది తిలకించనుండగా, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు.

 మిస్‌ వరల్డ్‌ సంస్థ ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. విజేతగా నిలిచే కొత్త ప్రపంచ సుందరికి ప్రస్తుత మిస్‌ వరల్డ్‌ క్రిస్టీనా పిష్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌) దాదాపు రూ.6.21 కోట్ల విలువైన బ్లూ క్రౌన్‌ను అలంకరించనుంది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రాండ్‌ ఫినాలే కొనసాగనుంది. విజేతకు దాదాపు రూ.ఎనిమిదిన్నర కోట్ల ప్రైజ్‌ మనీ దక్కనుంది.  

10 మందికి బెర్తులు ఖరారు 
తుది పోటీ 40 మంది మధ్య సాగనుంది. ప్రస్తుతం పోటీలోఉన్న 108 దేశాల సుందరీమణులను నాలుగు ఖండాల వారీగా విభజించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు చాలెంజ్‌ల ద్వారా ఫాస్ట్‌ ట్రాక్‌ పద్ధతిలో 16 మంది ఎంపికయ్యారు. మిగతా 24 మందిని శనివారం జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో న్యాయనిర్ణేతలు ఎంపిక చేస్తారు. మొత్తం 40 మంది నుంచి వివిధ పద్ధతుల ద్వారా ఒక్కో ఖండం నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 20 మందిని షార్ట్‌ లిస్టు చేస్తారు. సెమీ ఫైనల్స్‌లో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 8 మందిని ఫైనల్స్‌కు ఎంపిక చేస్తారు. వీరినుంచి విజేతను, మొదటి, రెండు, మూడో రన్నరప్‌లను ప్రకటిస్తారు. 

అలరించనున్న బాలీవుడ్‌ తారలు 
మిస్‌ వరల్డ్‌ 2016 స్టెఫానీ డెల్‌ వాలె, భారతీయ ప్రెజెంటర్‌ సచిన్‌ కుంభర్‌ హోస్టులుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్‌ తారలు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, ఇషాన్‌ ఖట్టర్‌ ఫైనల్స్‌లో స్టేజ్‌ పైన లైవ్‌ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రపంచ సుందరి పోటీలకు ప్రధాన న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సినీ నటుడు సోనూసూద్‌కు ఈ సందర్భంగా మానవతావాది పురస్కారాన్ని మిస్‌ వరల్డ్‌ సంస్థ అందించనుంది. కోవిడ్‌ సహా వివిధ సందర్భాల్లో ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు.  సోనూసూద్‌ కాకుండా, ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్‌ కారినా టర్రెల్‌ (మిస్‌  ఇంగ్లాండ్‌  2014), మిస్‌ వరల్డ్‌ సీఈఓ జూలియా మోర్లీ, మిస్‌ వరల్డ్‌ 2017, బాలీవుడ్‌ నటి మానుషి చిల్లర్‌ వ్యవహరించనున్నారు. 

వివిధ చాలెంజ్‌ల ద్వారా ఎంపికైన వారు వీరే.. 
స్పోర్ట్స్‌ చాలెంజ్‌: విజేత మిస్‌ ఎస్తోనియా ఎలిస్‌ రాండ్‌మా టాలెంట్‌ చాలెంజ్‌: విజేత మిస్‌ ఇండోనేసియా మొనికా కెజియా సెంబిరింగ్‌ హెడ్‌ టు హెడ్‌ చాలెంజ్‌: విజేతలు మిస్‌ వేల్స్, మిస్‌ తుర్కియే, మిస్‌ ట్రినిడాడ్‌–టొబాగో, మిస్‌ జాంబియా  ఫైనల్‌ పోటీలో ఆసియా నుంచి తుర్కియే భామ ఇదిల్‌ బిల్గెన్, ఆఫ్రికా నుంచి ఫెయిత్‌ బ్వాల్వా, అమెరికా–కరీబియన్‌ దీవుల నుంచి ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు చెందిన అన్నా లిసే నాన్టన్, యూరప్‌ నుంచి వేల్స్‌ ముద్దుగుమ్మ విల్లీ మీ ఆడమ్స్‌ ఎంపికయ్యారు. 

టాప్‌ మోడల్‌ చాలెంజ్‌: విజేతలు: మిస్‌ ఇండియా, మిస్‌ నమీబియా, మిస్‌ మారి్టనిక్, మిస్‌ ఐర్లాండ్‌ రెండు రోజుల క్రితం జరిగిన మల్టీమీడియా చాలెంజ్‌లో ఆఫ్రికా నుంచి కామెరూన్‌ సుందరి ఇస్సీ ప్రిన్సెస్, అమెరికా నుంచి డొమినిక్‌ రిపబ్లిక్‌ నుంచి మాయ్‌రా డెల్‌గాడో, ఏషియా–ఓíÙయానియా నుంచి థాయ్‌లాండ్‌ ముద్దుగుమ్మ సుచతా చౌంగ్‌శ్రీ, యూరప్‌ నుంచి మోంటెనిగ్రో సుందరి ఆండ్రీ నికోలిక్‌లు విజయం సాధించారు.  

మిల్లా మాగీపై మిస్‌ వరల్డ్‌ సంస్థ చర్యలు: జయేశ్‌ రంజన్‌ 
పోటీల నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించి పోటీల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీపై మిస్‌ వరల్డ్‌ సంస్థ న్యాయపరంగా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. లండన్‌ కోర్టులో కేసు దాఖలు చేసిందని వెల్లడించారు. అక్కడి ప్రభుత్వం కూడా ఆమెపై చర్యలకు ఉపక్రమించిందని చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు.  

2న రాజ్‌భవన్‌కు కొత్త ప్రపంచ సుందరి 
హైటెక్స్‌లో జరిగే మిస్‌ వరల్డ్‌ తుది పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జయేశ్‌ రంజన్‌ తెలిపారు. శనివారం విజేతగా నిలిచి కొత్త ప్రపంచ సుందరిగా అవతరించే యువతి జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి హాజరవుతుందని వెల్లడించారు.  

న్యూయార్క్‌ టైమ్‌స్కే్వర్‌పై తెలంగాణ సోయగం 
సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉన్న ప్రఖ్యాత టైమ్స్‌సే్క్వర్‌పై తెలంగాణ సంస్కృతి తళుక్కున మెరిసింది. ’తెలంగాణ– జరూర్‌ ఆనా’ అంటూ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 72వ మిస్‌ వరల్డ్‌ –2025 పోటీల వీడియోను టైమ్స్‌స్క్వేర్‌పై ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉన్న ఆ వీడియో న్యూయార్క్‌ వాసులను ఎంతగానో ఆకట్టుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement