హైదరాబాద్: భారీ వర్షం కారణంగా నగరంలో ఏర్పడిన పరిస్థితులపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
తక్కువ సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
నగరంలోని ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలపై మంత్రి ఆరా తీశారు. విద్యుత్ షాక్ తో ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలుసుకున్న సమాచారంతో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.కూలిన చెట్లు ,తెగిన విద్యుత్ తీగలు తొలగించడానికి సహాయక చర్యలను వేగవంతం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


