స్టార్టప్‌లకు అంతర్జాతీయ నెట్‌వర్క్‌

Minister Piyush Goyal Calls For Strengthening Global Startup Ecosystem - Sakshi

జీ–20 స్టార్టప్‌ 20 సమావేశాల్లో కేంద్రమంత్రి పీయుష్‌ గోయెల్‌ సూచన

భాగస్వాములుగా ఔత్సాహికులు, మెంటర్లు, పెట్టుబడిదారులు

ప్రపంచస్థాయి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇది అవసరమని అభిప్రాయం 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థికమాంద్యం మొదలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వరకూ ప్రపంచ స్థాయి సమస్యలను పరిష్కరించేందుకు స్టార్టప్‌­లు అవసరమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పీయుష్‌ గోయెల్‌ అభిప్రడాయపడ్డారు. ఔత్సాహికులు, పెట్టుబడిదారులు, మెంటర్లతో కూడిన నెట్‌వర్క్‌ ద్వారా స్టార్టప్‌లకు అన్నివిధాలుగా సాయం అందించేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు.

భారత్‌ అధ్యక్షతన ఈ ఏడాది జరగనున్న జీ–20 సదస్సు సన్నాహకాల్లో భాగంగా శనివారం హైద­రా­బా­ద్‌లో స్టార్టప్‌ –20 సమావేశాలు మొదల­య్యాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌­రెడ్డి, జీ–20 షేర్పా(సన్నాహక దేశ ప్రతినిధి) అమితాబ్‌ కాంత్‌ పాల్గొన్న ఈ సమావేశాన్ని ఉద్దేశించి గోయెల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. స్టార్టప్‌­ల­కు అనుకూల వాతా వరణం ఏర్పాటు, అందరికీ అవకాశాలు, మద్దతు లభించేలా చేయడం జీ–20 దేశాల ఉమ్మడి బాధ్యత అని అన్నారు.

స్టార్టప్‌ల ఏర్పాటుకు అంతర్జాతీయ నెట్‌వర్క్‌ స్ఫూర్తినిచ్చే­దిగా ఉండటమే కాకుండా, ఆలోచనలు, మేలైన కార్యాచరణ పద్ధ తులను పంచుకునేలా ఉండాలని, అవసరమైన నిధులకు, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అంశాల్లో పరస్పర సహకారానికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. ‘‘ఈ రోజుల్లో సృజనాత్మ కత అనేది ఆర్థిక లక్ష్యాల సాధనకు మాత్రమే ఉపయోగపడటంలేదు. సామాజిక, పర్యావరణ, సుస్థిరాభివృద్ధి సమస్యల పరిష్కారానికీ అవసర మవుతోంది’’అని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ 2016లోనే స్టార్టప్‌ ఇండియా కార్యక్ర మాన్ని మొదలుపెట్టగా ఈ ఏడేళ్లలో కొత్త, వినూత్న ఆలోచనలతో వివిధ రంగాల్లో పలు కంపెనీలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. ఫిన్‌టెక్, ఫైనాన్షి­యల్‌ ఇన్‌క్లూషన్, ఆరోగ్య రంగాల్లోని స్టార్టప్‌ కంపెనీల కారణంగానే కరోనా మహమ్మా­రిని ఎదు­ర్కోగలిగామన్నారు. ఆన్‌లైన్‌ విద్యా బోధన, వ్యవసాయ టెక్నాలజీల్లోనూ  సవాళ్లను స్టార్టప్‌లతో ఎదుర్కోగలిగామని వివ రించారు.

భారతదేశంలో ఆవిర్భవించిన కోవిన్, యూపీఐ వంటి టెక్నాలజీలు, ఈ–కామర్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్‌ నెట్‌వర్క్‌ (ఓఎన్‌డీసీ)లు ప్రపంచంలోని అనేక దేశాల సమస్యలను పరిష్కరించగలవని, అందుకే జీ–20 సదస్సు ద్వారా ఈ ‘ఇండియా స్టాక్‌’ను ప్రపంచానికి ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని గోయెల్‌ తెలిపారు. 

అనుకూల విధానాలతోనే వృద్ధి: కిషన్‌ రెడ్డి
స్టార్టప్‌లకు అనుకూల విధానాలను రూపొందించి అమలు చేస్తున్న కారణంగానే భారత్‌ అతితక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా రూపాంతరం చెందిందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ‘ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఫర్‌ స్టార్టప్స్‌’, ‘స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీమ్‌’లను కేంద్రం తీసుకొచ్చిందని తెలిపారు. ఏడేళ్లలోనే భారత్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో 41 స్థానాలు పైకి ఎగబాకిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో స్టార్టప్‌–20 ఇండియా చైర్‌పర్సన్‌ డాక్టర్‌ చింతన్‌ వైష్ణవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top