
తిమ్మాపూర్(మానకొండూర్): భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపం చెందిన ఓ మహిళ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రేణికుంటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరానగర్కు చెందిన రొడ్డ విజయకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. చిన్న కూతురు మమత(27)ను 2018లో రేణికుంటకు చెందిన రాజమల్లుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం ఒప్పుకుని రూ.30 వేలు ముట్టజెప్పారు. రూ.లక్ష కళ్యాణలక్ష్మి వచ్చిన తర్వాత ఇచ్చారు.
మరో రూ.70 వేలకు గడువు కోరి.. తర్వాత బంగారం ముట్టజెప్పారు. అయితే రాజమల్లు అదనంగా రూ.2 లక్షల కట్నం డిమాండ్ చేయడంతో గొడవలు జరుగుతున్నాయి. కొన్నిరోజులుగా రాజమల్లు రోజూ మద్యం తాగివచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. కట్నం తేకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం మమతకు తెలియడంతో మనస్తాపం చెందింది. సోమవారం అర్ధరాత్రి క్రిమిసంహారక మందు తాగింది. ఈ విషయాన్ని మమత కొడుకు అమ్మమ్మ విజయకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె రేణికుంటకు వెళ్లగా మమత అపస్మారక స్థితిలో కనిపించింది. వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అత్తింటి వేధింపులతో..
ఫెర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతినగర్కు చెందిన పెసరు అనిత (27) క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎన్టీపీసీ ఎస్సై టి.ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.