లక్ష పింఛన్ల ‘లెక్క’ తేల్లేదు! | Liveness Authentication For Pensions in Telangana | Sakshi
Sakshi News home page

లక్ష పింఛన్ల ‘లెక్క’ తేల్లేదు!

Jun 23 2026 6:03 AM | Updated on Jun 23 2026 6:03 AM

Liveness Authentication For Pensions in Telangana

లైవ్‌నెస్‌ అథెంటికేషన్‌ ప్రక్రియలో నిర్ధారణ కాని, అందని లక్షమంది వివరాలు

వీటిలో 40 వేలకు పైగా మరణించిన కేసులు 

మిగతావి ఫొటోలు క్యాప్చర్‌ కానివి, ఆధార్‌ సంబంధిత సమస్యలు, వలసలు.. లబ్ధిదారుల్లో పెద్ద భవనాలు, కార్లు, ట్రాక్టర్ల యజమానులు 

ఇప్పటివరకు నిరాటంకంగా చెల్లింపులు

సాక్షి, హైదరాబాద్‌: చేయూత పథకం కింద బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల ‘లైవ్‌నెస్‌ అథెంటికేషన్‌’(ప్రతి ఇంటికీ వెళ్లి పరిశీలన) ప్రక్రియలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ విధానం ద్వారా పింఛన్లు పొందుతున్న 19 లక్షలకు పైగా లబ్ధిదారుల్లో (పోస్ట్‌ ఆఫీస్‌లు, ఇతర రూపాల్లో మొత్తం కలిపి 41 లక్షల మందికి పైగా పింఛన్లు పొందుతున్నారు) ఇప్పటివరకు దాదాపు 16 లక్షల మంది లైవ్‌ అథెంటికేషన్‌ పూర్తి కాగా.. వీరిలో దాదాపు లక్ష వరకు పింఛన్లకు సంబంధించి వివరాలు నిర్ధారణ కాలేదు లేదా అందలేదు. వీరిలో 40 వేలకు పైగా మరణించిన వారు కాగా, ఫొటోలు క్యాప్చర్‌ కానివి 28 వేలు, ఆధార్‌కార్డు సమస్యలు 12 వేలు, ట్రేస్‌ కానివి, వలసలు, అథెంటిఫికేషన్‌కు రానివి 14–15 వేల దాకా ‘లైవ్‌నెస్‌ ఆథెంటికేషన్‌’లో వెల్లడైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

కాగా మరో 4 వేల మంది ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణలో పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో బ్యాంక్‌ ఖాతాల ద్వారా పింఛను పొందుతున్న వారు 23 వేల మంది దాకా ఉండగా..దాదాపు 5 వేల వరకు చనిపోయిన, క్యాప్చర్‌ కాని, ఆధార్‌ సమస్యలు, వలసలు తదితర కేసులు ఉన్నట్టు తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 734 పింఛన్లకు గాను దాదాపు 167 మంది, నల్లగొండ జిల్లాలో 1,500కు గాను 300 మంది, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 20 వేల మందికి గాను 3 వేల మంది, కామారెడ్డి జిల్లాలో 13 వేల మందికి గాను 2 వేల మంది, ములుగు జిల్లాలో 8 వేల మందికి గాను వెయ్యి మంది సరైన నిర్ధారణ లేనప్పటికీ పింఛను ప్రయోజనం పొందుతున్నట్టు వెల్లడైంది.  

పిల్లలకు లక్షకు పైగా జీతం వస్తున్నా.. 
నెలకు లక్షకు పైగా జీతం పొందుతున్న అధికారులు, ఉద్యోగుల తల్లిదండ్రుల్లో కొందరు చేయూత పింఛన్లు పొందుతున్నట్లు లైవ్‌ అథెంటికేషన్‌లో తేలింది. 
⇒ కార్లు,, ట్రాక్టర్లు, సొంతంగా పెద్ద భవనాలు ఉన్నవారు కూడా ప్రయోజనం పొందుతున్నారు 
⇒ దివ్యాంగులకు మాత్రమే ఇవ్వాల్సిన డిజెబిలిటీ పింఛన్లు.. వైకల్యం లేకపోయినా కొందరికి అందుతున్నాయి 
⇒ 50 ఏళ్లు దాటని వారికి కూడా వృద్ధాప్య పించన్లు అందుతున్నాయి. 

వీరికి లబ్ధిని నిలిపివేయండి 
రెగ్యులర్‌ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, మినిమమ్‌ టైమ్‌ స్కేల్, స్టేట్‌ స్కేల్‌ పొందుతున్న వారి సంక్షేమ పథకాల లబ్ధిని వెంటనే నిలిపేయాలని ఈ లైవ్‌ అథెంటికేషన్‌కు సంబంధించిన నివేదికలో ప్రభుత్వానికి అధికారులు సిఫారసు చేశారు. అయితే కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, దినసరి, గౌరవ వేతనం పొందే వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తున్నారు.  

అక్రమ పింఛను కేసులు ఏవంటే.. 
– మరణించిన వ్యక్తులకు.. 
– తప్పుడు వివరాలతో పింఛను పొందుతున్నవారు 
– మార్గదర్శకాలు, నియమ, నిబంధనలకు భిన్నంగా ప్రయోజనం పొందేవారు 
– కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. 
– వలస వెళ్లిన లబ్ధిదారుడు 

నెలాఖరు వరకు ‘లైవ్‌నెస్‌ ఆథెంటికేషన్‌’పొడిగింపు! 
చేయూత పథకం కింద బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల ‘లైవ్‌నెస్‌ ఆథెంటికేషన్‌’కార్యక్రమాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించినట్టుగా తెలుస్తోంది. ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైవ్‌ అథెంటికేషన్‌ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఇంకా సుమారు 3 లక్షల పింఛన్లకు సంబంధించి లైవ్‌ అథెంటికేషన్‌ పూర్తి కావలసి ఉంది. లైవ్‌ అథెంటికేషన్‌లో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి పరిశీలన నిర్వహిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. పింఛన్లు పొందుతున్నవారు నిజమైన అర్హులో కాదో తెలుసుకోవడంతో పాటు మరణించిన, వివరాలు సరిపోలని కేసులను గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన తాజా గడువు ఈ నెల 22వ తేదీతో ముగిసింది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement