
24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య విదర్భ నుంచి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర– దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది క్రమంగా ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. 24 జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం తెలిపింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.
మరింత పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఆదివారం ఆదిలాబాద్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 23.8 డిగ్రీ సెల్సియస్గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది.
ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్లలో)
కేంద్రం గరిష్టం కనిష్టం
ఆదిలాబాద్ 43.5 25.2
భద్రాచలం 39.4 29.0
దుండిగల్ 38.7 27.2
హకీంపేట్ 38.5 27.5
హనుమకొండ 40.0 25.5
హైదరాబాద్ 38.8 26.5
ఖమ్మం 40.4 27.0
మహబూబ్నగర్ 40.0 30.1
మెదక్ 41.8 23.8
నల్లగొండ 40.0 24.4
నిజామాబాద్ 43.1 27.2
రామగుండం 41.4 26.2