న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసు
ప్లాన్ అమలు బాధ్యతలు కిషన్కు అప్పగించిన ఆలంఖాన్లు
అతడి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎర
పోలీసు కస్టడీలో వివరాలు వెల్లడించిన ముగ్గురు నిందితులు
పరారీలో ఉన్న ఇద్దరిపై ఎల్ఓసీ జారీ చేసిన నగర పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డ్ ప్యానెల్ సభ్యుడు ఖాజా మొయిజుద్దీన్ హత్యకేసులో ముజాహిద్ ఆలంఖాన్తో పాటు కీలక నిందితులు కిషన్ సింగ్, అభిజీత్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నుంచి మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించగా... రెండు రోజుల విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు హసన్, మునీర్లపై నగర పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు.
ముజాహిద్ ఆలంఖాన్ గతంలోనూ ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయాలంటూ పలుమార్లు కిషన్ సింగ్కు చెప్పాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఓ దశలో ముజాహిద్ ఆలంఖాన్ ఓ మహిళ ద్వారా ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయించారు. ఆయన్ను తీవ్రంగా భయపెట్టాలనే ఈ పని చేయించారు. అబిడ్స్ పోలీసుల వరకు వెళ్లిన ఈ విషయం ఠాణాలో సెటిల్ అయింది.
ఏడాది క్రితం ముజాహిద్, మహబూబ్ ఆలంఖాన్లు కిషన్ను పిలిచి ఖాజా మొయిజుద్దీన్తో మాట్లాడాలని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించాలని కోరారు. న్యాయవాది హత్య జరగడానికి దాదాపు ఎనిమిది నెలల ముందు కిషన్ సింగ్ను ఆలంఖాన్లు తమ కార్యాలయానికి పిలిచారు. ఖాజా మొయిజుద్దీన్ను హత్య చేయాలని, అయితే అది రోడ్డు ప్రమాదంలా కనిపించాలని చెప్పారు. అందుకు అవసరమైన డబ్బుతో పాటు పని పూర్తి అయిన తర్వాత కిషన్ సింగ్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆలంఖాన్లు హామీ ఇచ్చారు.
ఖాజా మొయిజుద్దీన్ హత్య కుట్ర అమలును పర్యవేక్షించే బాధ్యతల్ని ముజాహిద్ ఆలంఖాన్ తన వద్ద పని చేసే హసన్ అలీతో పాటు మునీర్కు అప్పగించారు. హత్య చేయడానికి స్కార్పియో వాహనం కావాలంటూ కిషన్ గత ఏడాది డిసెంబర్లో ముజాహిద్కు చెప్పాడు. దీంతో ఆ వాహనం ఖరీదు చేయడానికి హసన్, మునీర్ ద్వారా రూ.2 లక్షలు కిషన్కు పంపారు.
మలక్పేటలో ఉన్న పది వేల గజాల వక్ఫ్ భూమి కొత్త కమిటీ గత ఏడాది డిసెంబర్లో ఆటో ఫిన్ కంపెనీకి లీజుకు ఇచి్చంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆలంఖాన్లు సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనికి కొనసాగింపుగా ఏప్రిల్లో ఆటోఫిన్ కంపెనీ యజమాని గౌతం చాంద్జైన్పై ఆలంఖాన్లు కేసు పెట్టగా... ఆ కంపెనీ మేనేజర్ ఎన్.నర్సింగ్రావు వీరి పైన కేసు పెట్టారు. ఈ కేసును ముజాహిద్ ఆలంఖాన్ కోర్టులో సవాల్ చేశారు. దీని విచారణ సందర్భంలో నర్సింగ్రావు తరఫున ఖాజా మొయిజుద్దీన్ హాజరుకావడాన్ని ఆలంఖాన్లు జీరి్ణంచుకోలేకపోయారు. దీంతో ఆయన హత్య కుట్ర అమలును వేగవంతం చేశారు.
అప్పటికే స్కారి్పయో వాహనాన్ని అభిజిత్ తాకట్టు పెట్టగా దాన్ని వినిపించడానికి కిషన్ సింగ్ రూ.లక్ష ఇచ్చారు. న్యాయవాది ఖాజా మెహిజుద్దీన్ను మే 23 తెల్లవారుజామున హత్య చేయగా.. దానికి ఒక రోజు ముందే అభిజీత్, వినయ్, మణిదీ్వప్లు స్కారి్పయో వాహనం నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేశారు. దీనికోసం దానిపై గ్రేజు, మట్టి పూశారు. ఈ వాహనాన్ని వినియోగించే అభిజీత్ మే 23న ఖాజా మొయిజుద్దీన్ను ఆయన ఇంటి వద్దే ఢీ కొట్టి చంపాడు.
ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న హసన్, మునీర్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్న పోలీసులు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా ఎల్ఓసీ జారీ చేశారు. దీని ప్రతుల్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు పంపారు. ముజాహిద్, కిషన్, అభిజీత్ పోలీసు కస్టడీ గడువు ముగియనుండటంతో వీరిని శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు.


