
కెరమెరి (ఆసిపాబాద్): గిరిజన వీరుడు కుమురం భీం మనవడు కుమురం సోనేరావు.. చేతిలో చిల్లి గవ్వలేక ఉపాధి పనులకు వెళ్తున్నాడు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం దోబే గ్రామానికి చెందిన కుమురం సోనేరావు, గౌరుబాయి దంపతులు.. పదిహేను రోజులుగా ఉపాధి హామీ పథకం కూలి పనికి వెళ్తున్నారు.
ప్రభుత్వం గతంలో ఐదెకరాల సాగుభూమి ఇచ్చినప్పటికీ.. తలదాచుకునేందుకు ఇల్లు లేదని వాపోయాడు. పలుమార్లు ఇంటి కోసం ఎమ్మెల్యే, కలెక్టర్కు దరఖాస్తు సమర్పించినా.. ప్రయోజనం లేకుండా పోయిందన్నాడు. గతంలో గుస్సాడీ రాజుకు ఇచ్చిన గౌరవం మాదిరిగానే.. తనను గుర్తించి ఆదుకోవాలని, నెలనెల ‘ఆసరా’ పింఛను అందించాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.

కూటి కోసం కోటి తిప్పలు..
నిర్మల్ జిల్లా (Nirmal District) ఖానాపూర్ డబుల్ బెడ్రూం కాలనీలో.. ఎక్బాల్పూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాల వారు ప్రదర్శించిన గారడీ (Garadi) ఆకట్టుకుంది. ఎక్బాల్పూర్లో నక్కలోల్ల (బొందిలోల్ల) కుటుంబాలు కొన్నేళ్లుగా నివసిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఖానాపూర్ పట్టణంలోని పలు కాలనీల్లో రాత్రి వేళ గారడీ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. కాగడాలు ప్రదర్శించడం, రైతు నాగలిని నోటితో ఆపుతూ చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి.
చదవండి: పోలీసుల ఎదుట విచారణకు హాజరైన స్మితా సబర్వాల్