రాజ్యాంగ హక్కులు ఢిల్లీ విద్యార్థులకేనా.. తెలంగాణ విద్యార్థులకు వర్తించవా?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం ముందు ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను ప్రశ్నిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నట్లు రాహుల్గాంధీ నాటకాలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై లాఠీలు ఝళిపిస్తూ, వారిని ఈడ్చుకెళ్లి, గొంతులు నొక్కేలా దాడులకు పాల్పడుతున్నా రాహుల్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా.. తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో విద్యార్థుల హక్కులు అణచివేస్తున్నా రాహుల్ స్పందించకపోవడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో జరిగిన లాఠీచార్జ్ను కూడా ఖండించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేవంత్రెడ్డిని డిమాండ్ చేయాలని కేటీఆర్ కోరారు. విద్యార్థుల హక్కుల విషయంలో రాజకీయాలకతీతంగా నిలబడతారా.. లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ రక్షణ కల్పిస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసే నైతిక ధైర్యం ఉన్న రాహుల్.. తెలంగాణలో కాంగ్రెస్ లాఠీలకు గురైన విద్యార్థుల కోసం కూడా అదే పోరాటం చేయాలని, లేకపోతే విద్యార్థుల పట్ల ఆయనది కపట ప్రేమగానే ప్రజలు భావించాల్సి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


