సదస్సును ప్రారంభిస్తున్న సీతక్క. చిత్రంలో తుమ్మల, వాకిటి శ్రీహరి, దాన కిశోర్ తదితరులు
రైతులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
ముందస్తు కార్యాచరణపై రాష్ట్రస్థాయి వర్క్షాప్లో మంత్రులు తుమ్మల, సీతక్క, శ్రీహరి
సాక్షి, హైదరాబాద్, ఏజీవర్శిటీ: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి శాఖ వేర్వేరుగా కాకుండా వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించి, స్వల్పకాలిక అవసరాలతోపాటు వచ్చే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులను ఎంపిక చేయాలన్నారు.
వీబీ–జీ రామ్జీ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని, ఈ నిధులతో శాశ్వత సామాజిక ఆస్తులను నిర్మించాలని చెప్పారు. నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు పంట కుంట, ప్రతి గ్రామానికి ఊటకుంట వంటి పనులను చేపట్టాలన్నారు. పంట కుంటల ద్వారా భూగర్భ జలాలు పెరగడంతోపాటు వ్యవసాయం, చేపల పెంపకం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. శుక్రవారం టీజీఐఆర్డీలో ఎల్నినో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాల్లో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణపై జరిగిన రాష్ట్రస్థాయి వర్క్షాప్లో మంత్రులు పాల్గొన్నారు.
‘ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వెబ్సైట్’ ఆవిష్కరణ
ఈ సందర్భంగా ‘ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వెబ్సైట్’ను మంత్రులు ఆవిష్కరించారు. ఈ వెబ్సైట్లో గ్రామాల వారీగా సమగ్ర వివరాలు పొందుపరచనున్నారు. గ్రామ జనాభా, అవసరాలు, వనరులు, గ్రామాభివృద్ధి ప్రణాళిక, శాఖల వారీగా జరుగుతున్న పనులు వంటి సమగ్ర వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. పీఆర్ఆర్డీ స్పెషల్ సీఎస్ దానకిశోర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి నిధుల అభివృద్ధి ప్రణాళికను రూపొందించి తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశంలో అగ్రగామిగా, స్వయం సమృద్ధిగా, అనుబంధ శాఖలతో అనుసంధానిస్తున్నామని చెప్పారు.
ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎస్ సంజయ్జాజు, పీఆర్ కమిషనర్ దివ్య దేవరాజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, పశుసంవర్థకశాఖ కార్యదర్శి ఇలంబర్తి , టీజీఐఆర్డీ సీఈఓ నిఖిల, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీఆర్డీఓలు, డీపీఓలు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్య శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామాలను సిద్ధం చేయాలని సీతక్క చెప్పారు. గ్రామాలకు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉండాలని చెప్పారు.
భారీ ప్రాజెక్టులు నిర్మించినా, ఇప్పటికీ 30 లక్షల బోర్లపై సాగు ఆధారపడి ఉన్నందున, భూగర్భ జలాలను పెంచే పనులను ఉపాధి హామీ ద్వారా విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని తుమ్మల చెప్పారు. కరువు పరిస్థితుల్లో పశువుల పెంపకం, సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని వాకిటి శ్రీహరి చెప్పారు. సెప్టెంబర్లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులకు సూచించారు.


