బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ | Justice for the Victim Must Prevail RS Praveen Kumar | Sakshi
Sakshi News home page

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Jun 23 2026 2:31 AM | Updated on Jun 23 2026 2:31 AM

Justice for the Victim Must Prevail RS Praveen Kumar

హైదరాబాద్‌: మైనర్ బాలికలకు రక్షణ దొరకడానికి బీఆర్ఎస్ పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. బండి భగీరథ్ పోక్సో కేసులో నాలుగు సార్లు బాలిక అత్యాచారానికి గురైందని అన్నారు. మొదటి నుంచి నిందితుడిని రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

‘‘బాధితురాలి మీదనే అక్రమంగా హనీట్రాప్ కేసు పెట్టించారు. కానీ, బీఆర్ఎస్ బాధితులకు న్యాయం జరగాలని పోరాడింది. మే8 న కేసు నమోదైనప్పటి నుంచి జైలుకు పోకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూస్తే.. బీఆర్ఎస్ పసిగట్టి ప్రజలు, సోషల్ మీడియా సహాయంతో పోరాడింది. పోరాడిన తర్వాత సెక్షన్ 6 యాడ్ చేశారు. ప్రజలు, మీడియా, బీఆర్ఎస్ పోరాటంతో బండి భగీరథ్ లొంగుబాటు, అరెస్ట్ డ్రామా చేశారు. 

అనంతరం చర్లపల్లి జైలుకు పంపారు. మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో 3 సార్లు బెయిల్ కు అప్లై చేస్తే.. రిజెక్ట్ చేశారు. కానీ ఈ విషయం బాధితురాలికి చెప్పలేదు. బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలం రికార్డు చేశారు. నిందితుడిని కూడా ఎగ్జామిన్ చేశారు. బాధితురాలి తల్లి ఈ నెల 17, 18 తేదీల్లో నాతో మాట్లాడింది. కేసులో ఏం జరుగుతుందో చెప్పడం లేదని వివరించింది.  ఇన్వెస్టిగేషన్ అధికారి బిజీగా ఉంటే, ఎవరో ఒక మహిళా అధికారి వీరికి ఎల్లప్పుడూ వివరాలు చెబుతూ ఉండాలి. 

బెయిల్ కోసం అప్లై చేస్తే తప్పకుండా బాధితులకు చెప్పాలి. బాధితురాలు స్టేట్మెంట్ వివరాలు అడిగితే అధికారులు ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు బాధితురాలితో మాట్లాడలేదు. బండి భగీరథ్ ని కాపాడాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. పోలీసులు నిందితులు, సహ నిందితులను వెంటనే ఎగ్జామిన్ చేయాలి. నిందితునికి బెయిల్ వచ్చిన విషయం బయటి ప్రపంచానికి ఎందుకు తెలియనివ్వడం లేదు?  అంత రహస్యంగా ఎందుకు చేస్తున్నారు? 

నిందితుని తరపు లాయర్ కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్ ప్రకారం..  ఇతను 2023 నుంచి 2026 వరకు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నాడు. 2023లో పాశవికంగా తోటి విద్యార్థులపై దాడి చేస్తే.. సస్పెండ్ చేశారు. మూడు సంవత్సరాల కోర్సులో ఇప్పుడు పరీక్షలు రాయకపోతే జీవితం ఆగమవుతదని ఇచ్చారు. 

ఇప్పటికీ బెయిల్ ఆర్డర్ ఇవ్వలేదు. బయటి ప్రపంచానికి, కనీసం బాధితులకు కూడా ఇవ్వడం లేదు. బాధితులు భయంతో కోర్టుకు, పోలీసులు వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రిసన్ మ్యానువల్ ప్రకారం... అందరూ జైలులో చదువుకొని, పరీక్షలు రాసుకోవచ్చు. భగీరథ్ బెయిల్ కోసం అప్లై చేస్తే... జైలులో రాయవచ్చు కదా? అమ్మాయికి న్యాయం జరగడం లేదు. హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం’’ అని తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement